కరోనా ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. చైనా కన్నా 17 రేట్ల అధిక వేగంతో ఇతర దేశాల్లో కరోనా వైరస్ ప్రబలుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 92 వేలకు చేరుకుంది. చైనాలోనే 80 వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 3200 దాటింది. ఇదే సమయంలో అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ గురించి పరీక్షలు నిర్వహించేందుకు తమ దగ్గర కావాల్సినన్ని కిట్లు లేవని వైట్హౌజ్ వెల్లడించింది.
అమెరికాలో కరోనా వైరస్ సోకిన వ్యక్తులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అమెరికాలోని సియాటెల్లో కొత్తగా 20 కేసులు నమోదు అయ్యాయి. రోడ్ ఐలాండ్లో సుమారు 200 మందిని క్వారెంటైన్ చేశారు. ఇప్పటి వరకు అమెరికాలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 12కు చేరుకుంది. మహమ్మారి కరోనాకు నియంత్రించేందుకు ఆ దేశ ఉభయసభలు...మెడికల్ ఎయిడ్ కోసం ఎమర్జెన్సీ నిధులను రిలీజ్ చేసింది. వారంలోగా పదిలక్షల టెస్టింగ్ కిట్లను అందివ్వడం వీలుకాదు అని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు. కాగా, అమెరికా వంటి అగ్రరాజ్యం ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం.
ఇటలీలో వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 148కి చేరుకుంది. ఇండియాలో వైరస్ సోకిన వారి సంఖ్య 30ని దాటిందని సమాచారం. దక్షిణ కొరియాలో మరణించిన వారి సంఖ్య 42కు చేరింది. రోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మందిని బలి తీసుకోనుందని ఒక తాజా అధ్యయనం హెచ్చరించింది. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2.3 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లనుందని పేర్కొంది. కరోనా ‘తీవ్రత తక్కువ’ ఉన్న సందర్భంలో ఈ మేరకు నష్టం సంభవించవచ్చని వెల్లడించింది. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. తొలి ఏడాదిలోపు చైనా, భారత్, అమెరికాలో లక్షల్లో ప్రాణాలు కోల్పోవచ్చని అంచనా వేశారు. బ్రిటన్ జీడీపీ 1.5 శాతం, అమెరికా జీడీపీ 2 శాతం తగ్గనుందన్నారు.