రాజకీయాల్లో రాణించిన మహిళామణులు ఎంతోమంది ఉన్నారు. అయితే కొందరు మహిళలు అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుని ఉన్నత స్థానాలకు ఎదిగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది సాధారణ గృహిణిగా ఉన్న మహిళలు రాష్ట్ర మంత్రులు.. కేంద్ర మంత్రులు అయ్యి ఇటు తెలుగు గడ్డపై... అటు జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. ఇలాంటివారిలో ప్రస్తుత ఏపీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కూడా ఒకరు. సాధారణ గృహిణిగా ఉన్న తానేటి వనితకు 2009 ఎన్నికల్లో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణ బాబు అండతో గోపాలపురం టిడిపి టిక్కెట్ దక్కింది. ఆ ఎన్నికల్లో ఆమె 15 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఆ తర్వాత మూడేళ్లకే ఆమె తన రాజకీయ గురువు అయిన కృష్ణబాబు అండదండలతో వైసీపీలోకి జంప్ చేశారు. 2014 ఎన్నికల్లో ఆమెకు గోపాలపురం సీటు కాకుండా పక్కనే ఉన్న మరో రిజర్వ్డ్ నియోజకవర్గం అయిన కొవ్వూరు నుంచి పోటీ చేయగా ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు ఆమె నియోజకవర్గాన్నే అంటి పెట్టుకుని ఉన్నారు. ఇక 2019 ఎన్నికల్లో ఆమె కొవ్వూరు నుంచి పోటీ చేసి టీడీపీ ఫైర్ బ్రాండ్ లేడీగా ఉన్న వంగలపూడి అనితను ఓడించారు.
ఇక రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనితకు ఏకంగా జగన్ కేబినెట్లో మంత్రి పదవి దక్కింది. ఎస్సీ + మహిళా కోటాలో వనిత మంత్రి అయ్యారు. మరో ట్విస్ట్ ఏంటంటే ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా వైసీపీ నుంచి తొలిసారే గెలిచి మంత్రి అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సమీకరణలతో పాటు అటు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మహిళలకు, ఎస్సీలకు కేబినెట్లో ప్రయార్టీ కల్పించిన నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి దక్కింది. వనిత తండ్రి మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు.
ఆయన టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి వారసత్వం అంది పుచ్చుకుని ఆమె గృహిణిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు ఎమ్మెల్యే అవ్వడంతో పాటు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర మంత్రి అయ్యారు. మంత్రిగా సంచలనాలు ఏమీ క్రియేట్ చేయకపోయినా సౌమ్యురాలిగా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అదే ఐటంలో నియోజకవర్గంలోనూ సోసోగా ముందుకు వెళుతున్నారు.