ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఇంకొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి.. షెడ్యూల్ కూడా విడుదలైంది. రిజర్వేషన్ల ప్రక్రియ కూడా దాదాపు పూర్తయిపోయింది. అయితే 2019 ఎన్నికల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు సత్తా చాటలని ఆతృతతో ఉన్నాయి. ముఖ్యంగా రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతున్న టిడిపి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించి పార్టీకి పూర్వవైభవం వచ్చేలా ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఇక అటు బిజెపి జనసేన పార్టీ కూడా గట్టి పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికలు ఎన్ని రోజుల వైసీపీ పాలన కు నిలువుటద్దంలా మారనున్నాయి. దీంతో వైసిపి పార్టీ కూడా ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా పైనే అధికార పార్టీ ఎక్కువ దృష్టి పెట్టింది. కర్నూలు జిల్లాలో టీడీపీకి బలమైన మద్దతు దారులుగా ఉన్న కోట్ల, కేఈ కుటుంబాలు లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో జడ్పీటీసీ స్థానాలను పలుమార్లు అధికారులు మార్పులు చేశారు. తొలుత గూడూరు మండలానికి చెందిన జనరల్ అభివృద్ధికి స్థానిక సంస్థల్లో అవకాశం ఇస్తూ రిజర్వేషన్లను ఖరారు చేసిన అధికారులు శుక్రవారం రాత్రి... ఆ రిజర్వేషన్ బీసీ మహిళలకు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.
అదే సమయంలో ఎమ్మిగనూరు స్థానంలో ఎస్సీ మహిళలకు కేటాయించగా .. అనంతరం ఓసీ మహిళ కేటాయిస్తూ నిర్ణయం తీసుకొని అక్కడి ఎమ్మెల్యే సామాజిక వర్గానికి అనుకూలంగా మార్చుకున్నది అధికార పార్టీ. అంతేకాకుండా ప్యాపిలిలో బిసి జనరల్ గా ముందు ప్రకటించిన రిజర్వేషన్ ను... ఒక్కరోజులోనే అన్ రిజర్వుడు జనరల్ గా మార్చి... మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి వర్గానికి అవకాశం కల్పించే విధంగా మార్పులు చేశారు. ఇక బేతంచెర్ల లో కూడా ఇలాంటి మార్పులు చేశారు. మొదట ఓసి మహిళా రిజర్వేషన్ ప్రకటించగా ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గా మార్పు చేశారు. ఇలా అన్ని స్థానాల్లో రిజర్వుడు క్యాటగిరి మార్పు చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నది అధికార పార్టీ.ఎక్కడైతే టీడీపీకి బలమైన మద్దతు దారులు ఉన్నారో.. అక్కడ వైసీపీ కి కలిసొచ్చే విధంగా రిజర్వేషన్ లలో మార్పులు చేసింది. ముఖ్యంగా కేయి,కోట్ల కుటుంబాలని లక్ష్యంగా చేసుకుని ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ప్రతిపక్ష టీడీపీ పార్టీకి ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా తమకు అనుకూలంగా ఉండేలా అన్నీ సవ్యంగా జరిగేలా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.