ఈ వారం తెలంగాణ రాష్ట్రంలో రెండే రెండు విషయాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఒకటి కరోనా, రెండో ది రాష్ట్ర బడ్జెట్. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రవేశించింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే ఒక వ్యక్తి ఆఫీసు పని మీద దుబాయ్ వెళ్లి తరువాత బెంగళూరు మీదుగా హైదరాబాద్ వచ్చాడు. ఆ వ్యక్తికి కరోనా ఉన్నట్టుగా గుర్తించటంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రజానీకం ఉలిక్కిపడింది. అదే సమయంలో పెద్ద ఎత్తున పుకార్లు కూడా షికారు చేశాయి.
మరింత మంది కరోనా సోకిందని, మైండ్స్పేస్లోని ఓ మహిళా ఉద్యోగికి కూడా కరోనా లక్షణాలు ఉన్నాయని.. ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. అయితే ప్రభుత్వం ఈ వార్తలను కొట్టిపడేసింది. కరోనా టెస్ట్ల కోసం వందల సంఖ్యలో ప్రజలు క్యూ కట్టడంతో అవేర్నెస్ విషయంలో ప్రభుత్వం చర్చలు తీసుకుంటుంది. అదే సమయంలో కరోనా మందు అంటూ మరిన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. శాస్త్రీయంగా నిర్థారణ కాకపోయినా ఓ హోమియోపతి మెడిసిన్ కరోనా రాకుండా అడ్డుకుంటుందన్న ప్రచారం చాలా గట్టిగా జరుగుతోంది. దీంతో ఇలాంటి వరుస పుకార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
ఇక ప్రధానంగా వినిపించిన మరో గుసగుస రాష్ట్ర బడ్జెట్కు సంబంధించినది. హరీష్ రావు ఆదివారం నాడు రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశ పెట్టబోతున్నాడు. అయితే ఈ సారి బడ్జెట్ సాదా సీదాగానే ఉండబోతుందన్న ప్రచారం జరుగుతోంది. బడ్జెట్ దాదాపు లక్షా 50 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అదే సమయంలో ప్రభుత్వం వృద్ధి రేటును 10 శాతంగా చూపించేందుకు కసరత్తులు చేస్తోందట. కేంద్ర నుంచి నిధుల తగ్గటం, రాష్ట్రంలో రెవెన్యూ ఆదాయం కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంధ్యం ఉండటంతో ఈ సారి బడ్జెట్పై సాధారణ జనాల్లో కూడా పెద్ద అంచనాలేమీ లేవు.