ఆంధ్రజ్యోతి.. ఈ పత్రిక టీడీపీకి అనుకూలమని.. వైసీపీకి ఆగర్భ శత్రువని టాక్ ఉంది. చంద్రబాబు చేసే ప్రతి పనినీ మెచ్చుకోవడం.. జగన్ చేసే ప్రతి పనినీ తప్పుబట్టడం ఈ పత్రిక విధానం అన్న అభిప్రాయం పాఠకుల్లో చాలా ఎక్కువగా ఉంది. అందులోనూ జగన్ ను ఓ రాజకీయ నేరగాడిగా.. ఆయన పార్టీ నేతలను నేరస్తుల ముఠాగా చిత్రీకరిస్తూ ఎన్నో కథనాలు ఈ మీడియాలో వస్తుంటాయి.
అలాంటిది ఇప్పుడు ఓ వైసీపీ అగ్రనేతలు ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ స్వయంగా మెచ్చుకున్నాడు.. ఇది నిజంగానే ఓ వండర్ అని చెప్పుకోవాలి. అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. గత వారం.. రిలయన్స్ అధిపతి ముఖేశ్ అంబానీ స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవడం రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. ఈ విషయాన్ని రాధాకృష్ణ తన కొత్త పలుకు వ్యాసంలో ప్రస్తావించారు.
ఢిల్లీలో తమ సంస్థ తరఫున ప్రభుత్వంలో వ్యవహారాలు పర్యవేక్షించే పరిమళ్ నత్వానీ అనే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వవలసిందిగా కోరడానికై ముకేశ్ అంబానీ వచ్చాడట. అసలు తమ తరఫున ఒకరికి రాజ్యసభ సీటు కావాలని ముఖేశ్ అంబానీ ఒక రాజకీయ పార్టీని కోరడం ఇదే మొదటిసారట. అందులోనూ ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి మరణానికి తానే కారణమని నిందించిన జగన్మోహన్ రెడ్డిని ముకేశ్ స్వయంగా వచ్చి కలవడం ఓ వింత అంటున్నారు రాధాకృష్ణ.
ఇలా కలవడం వల్ల ముఖేశ్ అంబానీ స్థాయి తగ్గి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థాయి పెరిగిందట. ఇంత వరకూ బాగానే ఉంది.. ఇక్కడే రాధాకృష్ణ ఓ వాస్తవం బయటపెట్టారు. అసలు ముఖేశ్ను కలవడానికి తానే ముంబై వస్తానని జగన్మోహన్ రెడ్డి చాలాకాలంగా కోరుతున్నారట. అప్పుడు ముఖ్యమంత్రిని కలవడానికి పెద్దగా ఆసక్తి చూపని ముఖేశ్.. ఇప్పుడు తానే స్వయంగా రావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసిందట. అయితే ఈ క్రెడిట్ అంతా జగన్ కుడి భుజమైన విజయసాయి రెడ్డిదేనట. ముఖేశ్ – జగన్ మధ్య సమావేశాన్ని ఎంపీ విజయసాయి రెడ్డి ఏర్పాటు చేశారని చెబుతున్నారట. ఏదేమైనా జగన్ కు విజయసాయి రెడ్డి వంటి నాయకుడు తోడు ఉండటం ఓ అసెట్ అంటూ కామెంట్ చేశారు రాధాకృష్ణ.