స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ కి ఝలక్లు మీద ఝలక్లు తగలబోతున్నాయి. ఇప్పటికే పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో ఉన్న నేతలు అందరూ వరుస పెట్టి వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే వాళ్లలో భరోసా నింపేందుకు కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబోరు ఏం చర్యలు తీసుకో లేకపోతున్నారు. ఇక జగన్ సొంత జిల్లా కడపలో మరో కీలక వికెట్ పడబోతోంది. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రామసుబ్బారెడ్డి చేరికపై సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
రామసుబ్బారెడ్డి కుటుంబం పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతోంది. ఇక చంద్రబాబు ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా రాజకీయ శత్రువులుగా ఉన్న రామసుబ్బారెడ్డి, మరో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబాలను టీడీపీలోకి తీసుకు వచ్చారు. గత ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి జమ్మలమడుగులో, ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేయగా ఇద్దరూ ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు నేతల్లో ఆది నారాయణ రెడ్డి ఇప్పటికే బీజేపీలోకి వెళ్లిపోయారు.
ఇప్పుడు రామ సుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లిపోతే అసలు అక్కడ టీడీపీ జెండా పట్టే, కట్టే నాథుడు కూడా ఉండరనే చెప్పాలి. నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు చివరకు జమ్మలమడుగు లాంటి చోట ఓ నియోజకవర్గ ఇన్ చార్జ్ను కూడా పెట్టలేని దుస్థితికి దిగజారిపోవడం దారుణమనే చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ పార్టీని నడిపించే నాథుడు లేకపోవడంతో చివరకు ఇక్కడ పార్టీ తరపున పోటీ చేసే కార్యకర్తలు కూడా లేని పరిస్థితి. విశాఖ, కడపలోనే కాకుండా… పలు జిల్లాలలో కూడా పార్టీ మారేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారట. దీంతో ఆ పార్టీకి భారీగా దెబ్బ తగిలే అవకాశాలు కన్పిస్తున్నాయి.