తమిళనాడులోని సేలంలో అర్థరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో నివసిస్తున్న భార్యభర్తలతో పాటు వారి ఇంట్లో ఉంటున్న బంధువైన ఓ బాలుడిని కూడా అతి దారుణంగా చంపారు. అసలు వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ కి చెందిన ఆకాశ్ (29) అనే దంపతులు కొన్నాళ్లుగా తమిళనాడులోని సేలం సమీపంలోని పనంగాడు పెరుమాకౌండనూర్ లో వారి జీవనం సాగిస్తున్నారు. కాగా., వీరికి 10 నెలల బాలుడు కూడా ఉన్నాడు. ఇంకా ఈ దంపతులతో పాటు వారి సమీప బంధువైన సన్నీ (15) అనే బాలుడు కూడా వీరితో ఉంటున్నాడు.
ఆ రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆదివారం రాత్రి 10నెలల బాలుడు ఏడుపు వినిపించడంతో అక్కడి స్థానికులు ఆకాశ్ ఇంటికి వెళ్లి చూశారు. అక్కడ వారికి అతని భార్య రక్తపు మడుగులో కనిపించింది. ఇంట్లోని మిగిలిన వారు ఎక్కడ అని వారు వెతకగా ఇంటి వెనక ఆకాశ్, సన్నీ విగతజీవులుగా పడి ఉన్నారు. ఆ ఘటనను చూసి కంగారు పడిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
అయితే.. అక్కడికి సేలం పోలీస్ కమిషనర్ సెంథిల్ కుమార్ సిబ్బందితో సహా సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరణ ప్రకారం.. ఇంట్లోకి ప్రవేశించిన దుండుగులు ముందుగా ఆకాశ్ భార్యను చంపి, తర్వాత ఇద్దరిని చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత స్థానికంగా ఉండే ఆగ్రాకు చెందిన నలుగురు యువకులు వినోద్, దినేశ్, విజి, సురాజ్ కనిపించలేదు. దీంతో పోలీసులకు వారిపై అనుమానం వచ్చింది.
పోలీసులు వారి ఆచూకీ కోసం సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు. అయితే.. ఆ నలుగురు యువకులు ఆదివారం రాత్రి ఆకాశ్ ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు పుటేజిలో కనిపించాయి. పోలీసులు వారే హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. కాగా., ఆకాశ్ భార్య మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆమె ఒంటి మీద ఉన్న దుస్తులు చిరిగిపోయి ఉండటంతో పోలీసులు ఆమెపై అత్యాచారయత్నం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న ఆ నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఆమెపై అత్యాచారయత్నం చేసే ప్రయత్నంలో ఆమె తిరస్కరించడంతో ఆమెను చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.