కరోనా వైరస్.. చైనాలో పుట్టి ప్రపంచమంతా విస్తరిస్తూ 100కు పైగా దేశాలు గజగజ వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఇక మనదేశంలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన కరోనా ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా పాకుతూ వస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముందుగా భయం రేపినా ఇప్పుడిప్పుడే ఎక్కువ మందికి నెగిటివ్ రిపోర్టులు వస్తుండడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక చైనాతో పాటు కొరియన్, చైనా చుట్టు పక్కల దేశాలకు విస్తరిస్తోన్న ఈ వైరస్ ఇప్పుడు ఆసియా దేశమైన ఇరాన్ను కూడా తీవ్రంగా వణికిస్తోంది.
ఇది ఆరికట్టకపోతే మానవాళిని ముంచేసే అతి భయంకరమైన వైరస్గా ఇప్పటికే ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా వెల్లడించింది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 3800 మందికి పైగా మృత్యువాత పడగా.. లక్షలాది మంది కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఇక అటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అన్నీ ఈ కోరోనా వల్ల నాశనం అయ్యాయి. చివరకు అమెరికా ఆర్థిక వ్యవస్థ సైతం కుప్పకూలింది. ఈ ఎఫెక్ట్ భారత ఆర్థిక వ్యవస్థపై సైతం తీవ్రంగా పడడంతో పాటు ఎంతో మంది కుబేరుల ఆస్తి కరిగిపోయేలా చేసింది.
ఇక ఇప్పుడు కరోనా వైరస్ అత్యంత ప్రభావం చూపుతున్న దేశాలు ఇటలీ, ఇరాన్. దీంతో ఇటలీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని నిబంధన విధించింది. తమ ఆదేశాలు ధిక్కరించి ఎవరైనా భయటకు వస్తే తీవ్ర చర్యలు తప్పవని.. అవసరమైతే వారిని అరెస్టులు కూడా చేస్తామని హెచ్చరించింది. మరీ అర్జెంట్ అయితే తప్ప ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని కూడా సూచించింది. ఆరు కోట్లకు పైగా జనాభా ఉన్న ఇటలీ ప్రజలు స్వచ్చందంగా నిర్భందంలో ఉండనున్నారు. కాగా ఇప్పటికే ఇటలీలో 9,712 కరోనా కేసులు నమోదు కాగా... మృతుల సంఖ్య 463కు చేరుకుంది.