పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ వదంతులు కలకలం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రచారంతో జిల్లా ప్రజలు మాంసాహారం తినటమే మానేశారు. ఫలితంగా జిల్లాలో గుడ్డు...సహా చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. పౌల్ట్రీ రంగం లక్షలాది రూపాయల నష్టం చవి చూడాల్సి వస్తోంది. మరి...కరోనా వైరస్ జిల్లా ప్రజలను ఇప్పట్లో వదిలి పెట్టే ప్రసక్తే లేదా?
పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వదంతులతో పౌల్ట్రీ రైతులు కుదేలయ్యారు. వరుస నష్టాలతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పౌల్ట్రీ రంగంలో ఒడిదుడుకులు సహజంగానే ఉంటాయి. అయితే కరోనా వైరస్ వదంతులతో మరింత నష్టాలను మూటగట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు పౌల్టీ ఉత్పత్తుల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ప్రతీ రోజు 56 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లుతోంది. గత 15 రోజులుగా జిల్లాలో పరిస్థితి ఇలానే ఉంది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో పౌల్ట్రీ రైతులు అల్లాడిపోతున్నారు.
ఇక...గత నెలలో గుడ్డు ధర నిలకడగా లేదు. 3 రూపాయల 10 పైసల నుంచి 4 రూపాయల వరకు ఎగబాకింది. ఆ తర్వాత మళ్లీ పడిపోయింది. ప్రస్తుతం గుడ్డు ధర 3 రూపాయల 40 పైసలుగా ఉంది. కనీసం 4 రూపాయలు ఉంటేనే గానీ గిట్టుబాటయ్యే పరిస్ధితి లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక గుడ్డుకు 70 పైసలు చొప్పున నష్టం వస్తోంది. రోజుకు 56 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో కోటి కోళ్ల వరకు ఉన్నాయి. ప్రతీ రోజు 80 లక్షల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. స్థానికంగా వినియోగం పోను మిగిలిన కోడుగుడ్లు ప్రధానంగా పశ్చిమ బెంగాల్కు ఎగుమతి అవుతున్నాయి. అయితే అక్కడ కరోనా వైరస్ వల్ల కొనుగోలు చేసే నాథుడు లేడు. ఫలితంగా అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు.
ఇక...ఈ ఎఫెక్ట్ చికెన్ అమ్మకాలపైనా పడింది. జిల్లాలో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. సాధారణ రోజుల్లో ప్రధాన పట్టణాలతో పాటు గ్రామాల్లో కనీసం 50 వేల కోళ్ల అమ్మకాలు జరుగుతుంటాయి. ఇలా నెలకు 14 లక్షల కోళ్లు అమ్మకాలు ఉంటాయి. ఒక్క ఆదివారమే కనీసం లక్షా 50 వేల కోళ్లు చొప్పున అమ్ముడవుతాయి. నెలకు 20 లక్షల కోళ్లు విక్రయాలు జరుగుతుంటాయి. అయితే కరోనా వైరస్ ప్రభావమా అంటూ 20 రోజుల నుంచి నాలుగో వంతుకు అమ్మకాలు పడిపోయాయి. గత ఆదివారం స్వల్పంగా అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
మరోవైపు...వైరస్ కారణంగా మృతి చెందిన కోళ్లను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. కాలువలు, రహదారుల పక్కనే పారేయడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెంటపాడు మండలం రావిపాడు వెంకయ్య ఒయ్యేరు కాలువ సమీపంలో మృతిచెందిన కోళ్లను సంచులలో మూటలుగా కట్టి పడేశారు.