తెలంగాణలో రాజకీయ చైతన్యం కలిగిన ఓ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఓ డమ్మీ గా మారిపోయారు. మూడున్నర దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను ఆయన తన కనుసైగలతో శాసించారు. పార్టీలతో సంబంధం లేకుండా ఆయన ఏం చెపితే అదే నడిచేది. అలాంటి సీనియర్ నేత రాజకీయంగా కూడా ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయినా సదరు మంత్రిని పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారు.
అభివృద్ధి పరంగా సదరు మాజీ మంత్రికి మంచి పేరే ఉన్నా కార్యకర్తలతో మమేకం కాకపోవడంతో పాటు గర్వం... ఎవరిని అయినా లెక్కచేయని తనం ఆయనకు మైనస్ అయ్యాయి. ఎంత అభివృద్ధి చేసినా సామాన్య ప్రజలను ఆయన దగ్గరకు రానివ్వరు అన్న టాక్ ఉంది. ఇక తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓ అనామకుడి చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆ అనామకుడు సైతం టీఆర్ఎస్లోకి వచ్చేశారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాతో పాటు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న సదరు మాజీ మంత్రి మాట ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో కూడా చెల్లుబాటు కావడం లేదు.
చివరకు ఒక చిన్న పదవి కూడా తన వర్గానికి ఇప్పించుకోలేని పరిస్థితి. చివరకు ఆ జిల్లా మంత్రి సైతం సదరు మాజీ మంత్రి ఉనికి అన్నదే లేకుండా చేయాలని చూస్తున్నాడట. ఇక సదరు మాజీ మంత్రిని అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు జిల్లా ఎంపీతో పాటు మరికొందరు నేతలు కలిసి ఓడించారు. ఆయన్ను జిల్లా రాజకీయాల నుంచి తప్పించాలని ఆ నేతలంతా సక్సెస్ అయ్యారు. ఏ మీటింగ్లో అయినా కాళ్లు కిందకు ఆరచాపుకుని కూర్చునే సదరు మాజీ మంత్రి ఇప్పుడు రాజకీయ వైరాగ్యంతో తన సొంత పొలంలో వ్యవసాయం చేసుకునే స్థితికి వచ్చేశారు.