ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు రాజకీయం ఒక్కసారిగా మారిపోతోంది. ఏ క్షణాన ఏ నేత టీడీపీ నుంచి వైసీపీలోకి వెళతారో ? తెలియని పరిస్థితి. వరుస షాకుల పరంపరలో తాజగా విశాఖ మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ. రెహ్మన్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఇక ఇప్పుడు ఆయనకు జగన్ దేవుడుగా కనిపిస్తున్నారు. పాతికేళ్ళకు పైగా టీడీపీలో ఉన్న అనుభవంతో పచ్చ పార్టీ లొసుగులు మొత్తం ఆయనకు తెలుసు. ఈ క్రమంలోనే జగన్ జోలికి వస్తే తాను మీ జాతకాలు... పసుపు పార్టీ బాగోతాలు అన్ని బయట పెడతానని ఘాటు వార్నింగ్ ఇస్తున్నారు.
జగన్ మంచి పాలన అందిస్తుంటే అది చూడలేక బాబోరి పార్టీ వాళ్లు కుళ్లుకుంటూ పసలేని ఆరోపణలు చేస్తున్నారని రెహమాన్ మండిపడ్డారు. ఏపీలో జగన్ మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. గతంలో ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేస్తే.. దానిని చంద్రబాబు దశల వారీగా ఎత్తేశారని రెహమాన్ మండిపడ్డారు. ఇక బాబు ఐదేళ్ల పాలన అంతా అవినీతి మయమని... ఆయన మద్యం వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని కూడా ఆయన ఆరోపించారు.
ఇక జగన్ ని జే టాక్స్ అంటూ విమర్శలు చేస్తే గత సర్కార్ లో మద్యం పేరిట బాబు సహా ఎవరెవరు ఎంతెంత ముడుపులు తీసుకున్నారో బయటపెడతానని రెహమాన్ సవాల్ చేశారు. ఇక గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రెహమాన్ విశాఖ సౌత్ సీటు ఆశించారు. ఆ ఎన్నికల్లో సౌత్ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కే ఇచ్చిన బాబు రెహమాన్ ను విశాఖ నగర టీడీపీ అధ్యక్షుడిగా చేశారు. ఆ తర్వాత ఆయన పార్టీ మీటింగ్లు పెడుతున్నా ఎవ్వరూ వెళ్లడం లేదు. ఇక ఇప్పుడు గ్రేటర్ విశాఖ ఎన్నికల నేపథ్యంలో రెహమాన్ సైకిల్ దిగి ఫ్యాన్ గూటికి చేరిపోయారు.