ఈ మద్య దేశంలో టిక్ టాక్ గోల ఏ రేంజ్ లో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. టిక్ టాక్ వల్ల ఎంత ఎంట్రటైన్ మెంట్ ఉందో అంత నష్టాలు కూడా ఉన్నాయి. టిక్ టాక్ వల్ల కొంత మంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. ముఖ్యంగా టిక్ టాక్ మోజులో పడి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొంత మంది ఈ టిక్ టాక్ వల్ల ఉద్యోగాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా జరిగాయి. ఆ మద్య సోషల్ మీడియాలో అల్పితా చౌదరి అనే లేడీ కానిస్టేబుల్ చేసిన టిక్ టాక్ వీడియో వైరల్ గా మారింది. అయితే విధి నిర్వహణలో ఆమె టిక్ టాక్ వీడియో చేసిందన్న కారణంతో డిపార్ట్ మెంట్ ఆమెను సస్పెండ్ చేసింది.
సస్పెండ్ అయిన అల్పితా ఇప్పుడు స్టార్ సింగర్ గామారింది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా అల్పిత కొత్త ఆల్బం 'కచ్చి కేరి, పకీ కేరి' (పచ్చి మామిడి, పండు మామిడి) విడుదలైంది. ఒకప్పుడు పోలీస్ స్టేషన్ వరకే పరిమితమైన ఆమె ఖ్యాతి ఇప్పుడు గుజరాత్ మొత్తం విస్తరించింది. ఇంకేముంది ఆ అమ్మడు పాటలకు ఫిదా అయిన ఆడియన్స్ ఆమెను ఇఫ్పుడు స్టార్ హోదాలో చూస్తున్నారు. ఒక్క ఆల్బమ్ తో స్టార్ గా అల్పిత సెలబ్రిటీ హోదా అందుకుంది.
అల్పిత అహ్మదాబాద్ లోక్ రక్షక్ దళ్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే, మెహ్సానా జిల్లా లంఘ్ నాజ్ పోలీస్ స్టేషన్ లాకప్ లో ఆమె టిక్ టాక్ వీడియో చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో అధికారులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసి విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో గుజరాతీ జానపద గాయకుడు జిఘ్నేశ్ కవిరాజ్ తో కలిసి అల్పిత పాడిన పాటలకు ప్రజాదరణ లభించింది.