కరోనా వైరస్ కారణంగా ప్రభావితం కాని రంగం...ప్రాంతం అంటూ లేదు. దేశంలో మరో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, పంజాబ్, కర్ణాటకలో ఒక్కొక్కరికి ఈ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. వీరిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. కేరళకు చెందిన ఈ మూడేళ్ల చిన్నారి తల్లిదండ్రులతో కలిసి ఇటీవల ఇటలీ నుంచి భారత్కు వచ్చింది. కాగా, బయటి దేశాలకు వెళ్లాలన్నా, విదేశాల నుంచి వచ్చినా, ఇల్లు అద్దెకు కావాలన్నా కరోనా వైరస్ కలకలం కొనసాగుతోంది.
అమెరికాలో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెతో కలిసి కర్ణాటకకు వచ్చారని, ఆయనకు వైద్య పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు బయటపడింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 45కు చేరింది. కాగా వైరస్ నేపథ్యంలో బెంగళూరు లోని అన్ని ప్రాథమిక పాఠశాలను నిరవధికంగా మూసివేయాలని అధికారులు ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తెరువకూడదని సూచించారు. మరోవైపు ఆదివారం దుబాయ్ నుంచి కర్ణాటకలోని మంగళూరులో ఉన్న విమానాశ్రయానికి చేరుకున్న ఓ వ్యక్తి కరోనా (కొవిడ్-19) లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించిన సిబ్బంది అతడిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తనకు వైరస్ సోకలేదని సిబ్బందితో వాగ్వాదానికి దిగిన అతడు రాత్రి సమయంలో దవాఖాన నుంచి పారిపోయాడు. దీంతో అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అద్దె ఇల్లు కావాలంటే ఆయా కాలనీల వాసులు నో కరోనా వైరస్ సర్టిఫికెట్ కావాలని అంటున్నారు. ఇది ఎక్కడో కాదు హైదరాబాద్లోనే. అయితే ఈ సర్టిఫికెట్లను గాంధీ ఆసుపత్రి వైద్యులే జారీచేయాల్సి ఉండటంతో అక్కడికి పరుగులు తీస్తున్నారు. మహేంద్రహిల్స్ వంటి ప్రాంతాలలో సర్టిఫికెట్ ఉంటేనే ఇల్లు అద్దెకు ఇస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. ఇతర దేశాలకు వెళ్లాలంటే కూడా సర్టిఫికెట్ ఉంటేనే వీసా జారీ చేస్తున్నారు. కరోనా వైరస్ లేదంటూ గాంధీ వైద్యులు జారీ చేసిన సర్టిఫికెట్కు చాలా ముఖ్యమైంది.