ఇంకొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో ఒక్కసారిగా ఆంధ్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో డబ్బు మద్యం పంచ కూడదని వోటర్లను ప్రలోభాలకు గురి చేయకూడదు అంటూ వైసీపీ సర్కార్ నిబంధన పెట్టిన విషయం తెలిసిందే. వోటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డబ్బు మద్యం పంచితే అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేస్తోంది. ఇకపోతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో... అన్ని పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి . ఇప్పటినుంచే తమదైన వ్యూహాలను అమలు చేస్తున్నారు.
అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదు అంటూ వైసిపి అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల బంధువులను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే వారికి పార్టీ నుండి బీ ఫార్మ్ ఇవ్వకూడదు అంటూ రీజనల్ కోఆర్డినేటర్ లకు ఆదేశాలు జారీ చేసింది వైసీపీ పార్టీ. కాగా నేటితో ఎంపిటిసి జెడ్పిటిసి నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే.
ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఎంపిటిసి జెడ్పిటిసి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. 5 గంటలకు ఈ నామినేషన్ల గడువు ముగిసి పోతుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 660 జడ్పిటిసి 9984 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక అభ్యర్థులు వేసిన నామినేషన్ను రేపు అధికారులు పరిశీలించి.. తుది జాబితాలో ఈ నెల 14న ప్రకటించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఈనెల 21న నిర్వహించనున్నారు అధికారులు. ఇక ఎన్నికల ఫలితాలు మార్చి 24 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక మరోవైపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా నేటి నుంచే ప్రారంభమైంది.ఈరోజు ఉదయం నుండి ఈ నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.