ఏపీలో జరుగుతోన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ వారసుల జోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ లేదు.. అన్ని పార్టీల్లోనూ ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేల వారసులు ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించు కుంటున్నారు. ఏపీలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న కీలకమైన విజయవాడ కార్పొరేషన్ మేయర్ పదవి కోసం స్థానిక లోక్సభ సభ్యుడు. టీడీపీ సీనియర్ నాయకుడు కేశినేని నాని.. తన రెండో కుమార్తె శ్వేతను బరిలోకి దింపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. నాని వాళ్లు అయితే తమకు చంద్రబాబు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని కూడా ప్రచారం చేసుకుంటున్నారు.
ఇక ఇదే పదవి కోసం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తమ్ముడి భార్య కూడా రేసులో ఉన్నారు. ఇక మరో మాజీ ఎమ్మెల్యే టీడీపీకి చెందిన బొండా ఉమా సైతం తన భార్య సుజాతను రేసులో దించుతున్నారు. ఇక వైసీపీకి తిరుగులేని బలం ఉన్న నెల్లూరు జిల్లాలో కూడా రాజకీయ వారసురాలి ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ సీనియర్ నేత, ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఏకైక కుమార్తె ఆదాల లక్ష్మీ రచన రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇంతకు రచన రెడ్డి ఎవరో కాదు వైసీపీకే చెందిన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆమె కోడలు అవుతుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి సోదరుడి కుమారుడు వంశీధర్ రెడ్డి భార్య. రచన ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్గా హైదరాబాద్లో స్థిరపడ్డారు. నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు జడ్పీటీసీ స్థానం నుంచి ఆమెతో నామినేషన్ దాఖలు చేయిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల టైంలోనే ఆమె తన తండ్రి చంద్రశేఖర్ రెడ్డితో పాటు తన మామ ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేశారు. మరి ఈ వారసురాళ్ల రాజకీయ కలలు ఎంత వరకు నెరవేరుతాయో ? చూడాలి.