రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి ఖరారు అయినప్పటికీ... తెలుగుదేశం పార్టీ బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ కానుండగా ఆ నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమై ఇప్పటికే అభ్యర్థులను వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఖరారు కూడా చేసేశారు. అయినప్పటికీ చంద్రబాబు తన పార్టీ అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యను బరిలో దింపుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుస్తామని కాదు.. ఈ ప్రభుత్వం చేసే ఆగడాలను.. ప్రజలకు తెలియచెప్పేందుకు పోటీ పెడుతున్నామన్న చంద్రబాబు.. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తామన్నారు. తమ ఓట్లు తామే వేసుకుంటామని.. ఇందులో తప్పేం ఉందన్నారు.
అయితే, చంద్రబాబు నిర్ణయంపై వైసీపీ సీనియర్ నేత మేరుగ నాగార్జున ఆసక్తికర రీతిలో స్పందించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని కల్లబొల్లి మాటలు చెబుతూ దళితులను అవహేళన చేస్తూ రాజ్యాంగాన్ని చంద్రబాబు కాలరాస్తాడని ఆయన మండిపడ్డారు.``చంద్రబాబు రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తాడు.చంద్రబాబు రాజకీయనేపధ్యమే దళితుల నడుంపై ఎక్కి స్వారీ చేయడం.ఈరోజు జగన్ పరిపాలన నేపధ్యమే దళితులను అక్కున చేర్చుకుని పరిపాలన చేయడం.` అని అన్నారు.
చంద్రబాబు దళితులకు ఎంతో అన్యాయం చేశారని నాగార్జున ఆరోపించారు. ``చంద్రబాబు త్రికరణ శుధ్దిగా రాజకీయాలు చేసే వ్యక్తి అయితే దళితులకు సముచిత స్దానం ఎప్పుడో ఒకసారి ఇచ్చేవాడు. ఇటీవలి వరకు మూడుసార్లు రాజ్యసభ ఎన్నికలు జరుగుతుంటే టిడిపిలో ఏనాడైనా సామాజిక న్యాయం జరిగిందా? సామాజిక విలువలకు పాతర వేసిన వ్యక్తి చంద్రబాబు.దానిలో బలిపశువులు దళితులు. రాజ్యసభ సీట్లు ఇచ్చినప్పుడు ఈరోజు నీ దగ్గర గావుకేకలు పెట్టే వర్లరామయ్య ఎన్నిసార్లు నష్టపోయాడు? సీనియర్ నేత ఎన్టీఆర్, నీతోపాటు సమకాలికులుగా ఉన్న జేఆర్ పుష్పరాజ్కు రాజ్యసభ సభ్యత్వం ఇస్తానని మోసం చేశావు చంద్రబాబు. అప్పుడు పుష్పరాజు,ఇప్పుడు వర్లరామయ్య.` అంటూ వివరించారు.
``గతంలో గరికపాటి రామ్మోహన్ రావు,తోటసీతారామలక్ష్మి, ఆ తర్వాత సుజనాచౌదరి,టిజివెంకటేశ్ ఎన్డిఏలో ఎవరికో ఇచ్చారు. ప్రకాశం బ్యారేజ్ దాకా వచ్చిన వర్ల రామయ్యకు సీటు నిరాకరించి మోసం చేశారు. అప్పుడు బోరున కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబసమేతంగా వచ్చి వెనకకు వెళ్లిపోవాల్సిన పరిస్దితి కల్పించారు.`` అంటూ నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు.