`ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్ను తలపిస్తోంది. బీహార్లో కూడా ఇన్ని అక్రమాలు, అఘాయిత్యాలు జరిగాయని అనుకోవడం లేదు. మేం వస్తే స్వర్గం చూపిస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి... ఇపుడు ప్రజలు ప్రశాంత జీవనం కోల్పోయిన పరిస్థితిని వైసీపీ పార్టీ కలిగించింది. కోర్టు ఆదేశాలతో స్థానిక ఎన్నికలు హడావుడిగా నిర్వహిస్తున్నారు. దౌర్జన్యం, దాడులు, బెదిరింపులతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. విజయం సాధించకపోతే ఎమ్మెల్యేల అంతు చూస్తానని సీఎం బెదిరించారు. దీంతో ఎమ్మెల్యేలు అరాచకాలకు పాల్పడుతున్నారు` అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో పరిపాలనపై సంచలన కామెంట్లు చేశారు. ``గతంలో టెండర్ల వద్ద ఫ్యాక్సనిస్టుల బెదిరింపులు చూశాము. కానీ ఇపుడు ఎన్నికల సమయంలో నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. పోలీసులు, అధికారులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు. ప్రభుత్వంపై పోలీసులపై నమ్మకం లేదు. పక్క రాష్ట్రం నుంచి పోలీసులను తెచ్చి ఎన్నికలు జరపాలి.` అని కన్నా డిమాండ్ చేశారు.
వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలను బెదిరిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ``వైసీపీకి ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు తొలగిస్తామని అంటున్నారు. పోలీసు వ్యవస్థ కూడా మరీ దుర్మార్గంగా తయారయింది. నేను స్వయంగా డీజీపీని కలిసి రాజకీయ దాడులపై ఫిర్యాదు చేశాను. అయినా పోలీసులు వేధింపులు మానలేదు. కేవలం 9 నెలల కాలంలో ఇంతటి అరాచకం గతంలో ఎన్నడూ లేదు. ముఖ్యమంత్రి చెప్పే నీతులు కేవలం మాటలకే పరిమితం`` అని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ మోసం చేయడానికేనని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ``వైసీపీ అభ్యర్థులు దమ్ముంటే డబ్బు, మద్యం పంచకుండా ఎన్నికలకు వెళ్లాలి. ముఖ్యమంత్రి సొంత బాబాయ్ హత్య జరిగితే రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేక సిబిఐ విచారణకు అడిగారు. ఇంతకంటే రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థకు అవమానం ఉందా? దీనికి ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా.. డీజీపీ రాజీనామా చేస్తారా? గతంలో సీబీఐ విచారణ అడిగిన జగన్ ఇపుడు ఎందుకు మాట మార్చారు.`` అని ప్రశ్నించారు.