మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసు దోషి నళినికి మద్రాస్ హైకోర్టు పెరోల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రాజీవ్ హత్య కేసులో దోషులుగా తేలిన నళిని భర్త మురుగన్ వేలూరులోని పురుషుల జైలులో ఉండగా, ఆమె మహిళా జైలులో ఉంది. తన కుమార్తె వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సి ఉందని, ఆరు నెలలపాటు పెరోల్ ఇవ్వాలన్న నళిని అభ్యర్థనకు మద్రాస్ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే, నెల రోజులు మాత్రమే పెరోల్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషి నళినికి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. తనను విడుదల చేయాల్సిందిగా గవర్నర్‌కు ఆదేశాలివ్వాలని అభ్యర్థిస్తూ ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.  

 

కాగా, నళిని సహా ఈ కేసులో దోషులైన ఏడుగురిని విడుదల చేయాలంటూ గతేడాది సెప్టెంబరు 9న రాష్ట్రమంత్రి వర్గం నిర్ణయించింది.  గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ పరిశీలన కోసం ఈ ప్రతిపాదనను పంపింది. అయితే, గవర్నర్ ఆ ప్రతిపాదనను పెండింగులో పెట్టారు. ఈ నేపథ్యంలో నళిని ఈ పిటిషన్ దాఖలు చేసింది. మంత్రివర్గ నిర్ణయం ప్రకారం తమను విడుదల చేయాలని, ఈ మేరకు గవర్నర్‌కు ఆదేశాలివ్వాలంటూ కోర్టును అభ్యర్థించింది. ఈ విషయంపై నళిని తరుపు న్యాయ వాది మాట్లాడుతూ..  మంత్రివర్గ నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని, రాష్ట్రాన్ని నడుపుతున్నది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కాదని వాదించారు.

 

అప్పట్లో ఈ విషయం పై  జయలలిత  ప్రతిపాదనే చేశారని అయితే, అప్పుడు కేంద్రం నిరాకరించిందని అదనపు సొలిసిటర్ జనరల్ రాజగోపాల్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.   ఈ నేపథ్యంలో న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం  నళిని చట్ట విరుద్ధంగా జైలు శిక్ష అనుభవిస్తున్నట్టు తాము భావించలేమని, ఈ విషయంలో గవర్నర్‌ను ఆదేశించలేమని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. మొత్తానికి మరోసారి నళికి కోర్టులో చుక్కెదురైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: