ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి అనే సామెత అందరికీ తెలిసిందే. నిజంగానే కొన్ని సార్లు ఒక్క వెలుగు వెలిగిపోయిన వారు.. కాలం కలిసి రాక ఢమాల్ నా అతః పాతాళానికి వెళ్తారు. నిజమే.. కాలం కలిసి రాకుంటే దేనికైనా సిద్ద పడాల్సిందే అంటారు. ఇప్పుడు అనంతపురం రాజకీయల్లో ఇదే జరుగుతుందా అంటే అవుననే అంటున్నారు. రాజకీయాలు అంటే చిన్న కార్యకర్త నుంచి ఒక్కో పదవి అలంకరిస్తూ పెద్ద పదవిలోకి రావాలని చూస్తుంటారు.. దానికోసం ఎంతో కష్టపడుతుంటారు. సర్పంచ్ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే స్థాయికి మంత్రి పదవిలోకి వచ్చినవారిని చూశాం.. అయితే అనంతపురంలో ఇప్పుడు ట్విస్ట్ నెలకొంది.
ఎమ్మెల్యే పదవిలో కొనసాగిన జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా కౌన్సిలర్గా నామినేషన్ దాఖలు చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. ఆయనపై వైఎస్సార్సీపీ నుంచి బరిలోకి దిగిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్హవర్ధన్రెడ్డి పోటీగా నిలబడ్డారు. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంటామన్న జేసీ ఫ్యామిలీ చెప్పిన విషయం తెలిసిందే. కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బరిలోకి దిగింది. దివాకర్రెడ్డి తమ వర్గీయులు పోటీ చేయరని చెప్పినా.. కుమారుడు పవన్కుమార్ రెడ్డి మాత్రం వెనక్కు తగ్గేది లేదు.. టీడీపీ బరిలో ఉంటుందని తేల్చి చెప్పారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, జేసీ దివాకర్రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపాలిటీ ఎన్నికల బరిలోకి దిగారు. తాడిపత్రి మున్సిపాలీటీ 30వ వార్డుకు కౌన్సిలర్గా నామినేషన్ వేశారు. ఆయన తరుపు నుంచి లాయర్లు నామినేషన్ దాఖలు చేశారు. దాంతో తానూ పోటీలో ఉన్నానని సంకేతాలు ఇచ్చేశారు జేసీ. ప్రభాకర్రెడ్డి పోటీచేస్తున్న వార్డు నుంచి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద కుమారుడు హర్షవర్ధన్ పోటీకి నిలిచారు. ఇంకేముంది మల్లీ అనంత రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జేసీ వర్సెస్ కేతిరెడ్డి ఫ్యామిలీగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.