తెలంగాణ లో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల కోసం అధికార టీఆరెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది . అందరూ ఊహించినట్లుగానే ఆ పార్టీ రాజ్యసభ పక్ష నేత, పార్టీ సెక్రటరీ జెనరల్ కేశవరావు మరొకసారి అవకాశం ఇవ్వాలని టీఆరెస్ అధ్యక్షుడు , ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు . అయితే రెండవ అభ్యర్థి స్థానం కోసం పార్టీ నాయకత్వం, పలువురి పేర్లను పరిశీలించింది . ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి రాజ్యసభ అభ్యర్థిత్వం దాదాపు ఖాయమేనన్న ప్రచారం జరిగింది . బుధవారం అసెంబ్లీలో ఆయన కేటీఆర్ ను కూడా కలుసుకున్నారు . దీనితో పొంగులేటినే పార్టీ రెండవ రాజ్యసభ అభ్యర్థి అని అందరూ భావించారు .
కానీ కేసీఆర్, అనూహ్యంగా మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చారు . సురేష్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆరెస్ లో చేరారు . సౌమ్యుడిగా పేరున్న సురేష్ రెడ్డి ని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందని భావిస్తున్న తరుణం లో రాజ్యసభ అభ్యర్థిగా ఆయన పేరు ను కేసీఆర్ ఖరారు చేశారు . అసలు శ్రీనివాస్ రెడ్డి ని కాదని సురేష్ రెడ్డి అభ్యర్థిత్వం వైపు కేసీఆర్ మొగ్గు చూపడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది . శ్రీనివాస్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు టీఆరెస్ అభ్యర్థులను ఓడించేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది .
తుమ్మల నాగేశ్వర్ రావు , జలగం ప్రసాద్ రావు , మదన్ లాల్ లను ఓడించేందుకు ప్రయత్నించడం వల్లే ఆయనకు లోక్ సభ టికెట్ ఇవ్వలేదన్న వాదనలు పార్టీ వర్గాల్లో విన్పిస్తున్నాయి . ఇక ఇప్పుడు కూడా అదే కారణం తో రాజ్యసభ టికెట్ దక్కి ఉండకపోవచ్చునని అంటున్నారు . అయితే రాష్ట్రం లో జరుగుతున్న పలు ప్రాజెక్టు పనుల్లో పొంగులేటి కి వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్నారని , అందుకే ఆయనకు రాజ్యసభ ఇవ్వలేదన్న వాదనలు కూడా లేకపోలేదు .