తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త విషయంలో ఆత్మహత్య సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మిర్యాలగూడ వ్యాపారి హైదరాబాద్లో అనుమానిత స్థితిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మారుతీరావు డ్రైవర్ రాజేష్ను పోలీసులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా డ్రైవర్ పలు వివరాలను వెల్లడించాడని సమాచారం.
కాగా, మారుతీరావు డ్రైవర్ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ బయల్దేరిన మారుతీరావు మిర్యాలగూడలో పురుగుల మందు దుకాణం వద్ద ఆగినట్లుగా డ్రైవర్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఆయన తరచూ అదే దుకాణంలో కూర్చునే వాడని, అందుకే పెద్దగా తనకు అనుమానం రాలేదని చెప్పినట్లు తెలుస్తోంది. హైదరాబాద్కు చేరుకుని చింతల్బస్తీలోని ఆర్యవైశ్య భవన్కు వచ్చాక బయట అల్పాహారం తీసుకున్నట్లు డ్రైవర్ వెల్లడించాడు. రాత్రి గదిలో పడుకుంటానని మారుతీరావును కోరానని అయితే, మారుతీరావు నో చెప్పడంతో నిద్రించేందుకు కిందికి వెళ్లినట్లు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. కాగా, డ్రైవర్ నుంచి మరిన్ని వివరాలు చెప్పినట్లు తెలుస్తోంది.
మారుతీరావు కూతురు అమృత తన తండ్రి మరణం విషయంలో సంచలన వెల్లడించారు. తన తండ్రిని కడసారి చూసేందుకు శ్మశానవాటిక వద్దకు అమృత వెళ్లగా, ఆమెను మారుతీరావు బంధువులు అడ్డుకున్నారు. దీంతో తండ్రి మృతదేహాన్ని చూడకుండానే వెనుదిరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘నా తండ్రి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు.` అని అనుమానాలు వ్యక్తం చేశారు. ``ఆస్తుల విషయంలో మారుతీరావు, బాబాయి శ్రవణ్కు మధ్య గొడవలు ఉన్నాయి. మారుతీరావును శ్రవణ్ కొన్నిసార్లు కొట్టినట్లుగా నాకు తెలిసింది. మారుతీరావు ఆస్తులపై నాకు ఆశ, ఆసక్తి లేదు. మా అమ్మకు కూడా ప్రాణాపాయం ఉండొచ్చు. శ్రవణ్ రెచ్చగొట్టడం వల్లే ప్రణయ్ను మారుతీరావు హత్య చేయించాడు.`` అని సంచలన ఆరోపణలు చేశారు.