తెలుగుదేశం పార్టీ ఇంతటి సంక్షోభ సమయాన్ని ఇంతకుమునుపు ఎప్పుడు చవి చూసి ఉండదు . సాధారణ ఎన్నికల ముందు పార్టీ ఫిరాయింపులు సహజమే కానీ స్థానిక సంస్థల ముందు ఈ ఫిరాయింపులేమిటో అంతుచిక్కకా తెలుగుదేశం పార్టీ నాయకత్వం తలలు బద్దలు కొట్టుకుంటోంది . పార్టీ ఫిరాయిస్తున్న వారు ఆషామాషీ నాయకులైతే టీడీపీ నాయకత్వం కూడా ఇంత తీవ్రస్థాయి లో ఆందోళన చెంది ఉండేది కాదేమోనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది .
కడప జిల్లాలో టీడీపీ అంటే రామసుబ్బారెడ్డి , సతీష్ రెడ్డి ... సతీష్ రెడ్డి , రామసుబ్బారెడ్డి అంటే టీడీపీ అన్నట్లుగా వ్యవహరించిన నేతలు, ఒకరిప్పటికే పార్టీ ఫిరాయించగా , ఒకరు , రేపో , మాపో అన్నట్లుగా పరిస్థితి నెలకొంది . పులివెందుల లో వైఎస్ ఫ్యామిలీ ని ఎదురించి టీడీపీ పక్షాన ప్రతీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వచ్చిన సతీష్ రెడ్డి , అనూహ్యంగా పార్టీకి గుడ్ బై చెప్పేశాడు . ఇక రామసుబ్బారెడ్డి అయితే ఏకంగా జగన్ సమక్షం లో వైస్సార్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నాడు . గురువారం ఎమ్మెల్యే కరుణం బలరాం టీడీపీ నాయకత్వానికి షాక్ ఇస్తూ , కొడుకుతో సహా వైస్సార్ కాంగ్రెస్ గూటికి చేరిపోయాడు . ఇప్పటికే ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ , మాజీ ఎమ్మెల్యే రహ్మాన్ లు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేసుకున్నారు .
టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, ఇప్పటికే ముగ్గురు వైస్సార్ కాంగ్రెస్ అనుబంధ సభ్యులుగా మారిపోయారు . ఇక కరుణం బలరాం , వల్లభనేని వంశీ , మద్దాలి గిరి తరహాలోనే టీడీపీ ని వీడి వైస్సార్ కాంగ్రెస్ గూటికి చేరాలనుకుంటున్న వారు ఎంతమందో త్వరలోనే తేలనుంది . ఇప్పటికే ముగ్గుర్నిఎమ్మెల్యేలను చేజార్చుకోవడమే కాకుండా , పలువురు మాజీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలను చేజార్చుకున్న టీడీపీ నాయకత్వం సొంత పార్టీ క్యాడర్ ను స్థానిక సమరానికి ఎలా సన్నద్ధం చేస్తుందో చూడాలి మరి .