తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో నిద్రిస్తున్న భర్తపై భార్య పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేసింది. భార్యాభర్తలకు తరచుగా గొడవలు జరుగుతూ ఉండటంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మొదట్లో బాగానే ఉన్నా... కొన్ని నెలల నుండి తరచుగా గొడవలు పడుతున్నారు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే ఇల్లెందులోని వినోబా కాలనీకి చెందిన నక్కా కళ్యాణ్ అదే మండలం నిజాంపేటకు చెందిన శైలజను ప్రేమించాడు. యువతి అతని ప్రేమకు అంగీకరించడంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట్లో అన్యోన్యంగా మెలిగిన ఈ జంట ఆ తర్వాత చిన్న చిన్న విషయాలకే ఒకరిని ఒకరు నిందించుకుంటూ ప్రతిరోజూ ఏదో ఒక విషయంలో గొడవ పడేవారు. గ్రామ పెద్దలు వీరిద్దరినీ పిలిపించి నచ్చజెప్పటానికి ప్రయత్నించారు. 
 
గ్రామ పెద్దల సమక్షంలో గొడవలు పడబోమని చెప్పినా మరలా ఏదో ఒక విషయంలో ఇద్దరూ ఘర్షణ పడేవారు. దీంతో శైలజ తన భర్తను చంపడమే సమస్యకు సరైన పరిష్కారం అని ఆలోచించి కళ్యాణ్ ను చంపేయాలని నిర్ణయించుకుంది. బుధవారం రోజు రాత్రి 2 గంటలకు నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. మంటలకు తాళలేక గట్టిగా కేకలు పెడుతూ కళ్యాణ్ ఇంటి బయటకు పరుగులు పెట్టాడు. 
 
కేకలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే ఎంతో శ్రమించి మంటలు ఆర్పివేశారు. కానీ పెట్రోల్ పోసి నిప్పంటించటంతో బాధితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు మొదట ఇల్లెందు ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు అక్కడినుండి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి బాధితుడు మృతి చెందాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శైలజను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.       

మరింత సమాచారం తెలుసుకోండి: