ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్లో కూడా పంజా విసురుతోంది. మన దేశంలో కేరళ రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. ఇక అప్పటి నుంచి కరోనా ప్రధానంగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా హడావిడి మామూలుగా లేదు. ముందుగా తెలంగాణను వణికించిన కరోనాకు అక్కడ ప్రభుత్వం పక్కా ప్లానింగ్తో బ్రేకులు వేసింది. తెలంగాణలో పాజిటివ్ వచ్చిన వారికి కూడా నెగిటివ్ వచ్చేలా అధికారులు సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు కరోనా వంతు ఏపీకి కూడా వచ్చింది. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్దారణ అయ్యింది.
ఇక ఇప్పుడు ప్రముఖ దిగ్గజ సంస్థ అయిన గూగుల్ను కూడా కరోనా భయపెట్టేస్తోంది. తాజాగా తమ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్టు గూగుల్ సంస్థ తెలిపింది. బెంగళూరు ఆఫీసులో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలిందని వెల్లడించింది. ఈ మేరకు గూగుల్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా లక్షణాలు బయటపడానికి ముందు కూడా సదరు ఉద్యోగి గూగుల్ ఆఫీస్లో విధులు నిర్వహించాడట. ఈ క్రమంలోనే ఇప్పుడు బెంగళూరు క్యాంపస్ అంతా కరోనా వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొందరికి వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చింది.
సదరు ఉద్యోగితో స్వీయ నిర్బంధంలో ఉండాలని మిగిలిన వారికి సూచించింది. కరోనా పాజిటివ్గా తేలిన గూగుల్ ఉద్యోగిని బెంగళూరు హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డులో ఉంచినట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి శ్రీరాములు తెలిపారు. ఇదిలా ఉంటే భారత్లో తొలి కరోనా మరణం సంభవించింది. బుధవారం కర్నాటక కలబుర్గిలో చనిపోయిన 76 ఏళ్ల వృద్ధుడు మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ కరోనా వైరస్తోనే చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు భారత్లో 74 మందికి కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. క్రమక్రమంగా మనదేశంలో కూడా కరోనా కోరలు చాస్తుండడంతో అంతా భయాందోళనలు ఎక్కువ అవుతున్నాయి.