ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా భయం పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ మనుషులకు మాత్రమే కాదు వాణిజ్య వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేస్తుంది. ముఖ్యంగా మాంసాహారులకు చేదు వార్తలు అందుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ తో చికెన్ ధర దారుణంగా పడిపోతుంది. మొన్నటి వరకు రూ. 250 ఉన్న చికెన్ ఇప్పుడు కేవలం రూ.20 కే పడిపోయింది. కోడిగుడ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే చికెన్ తో పాటు ఇప్పుడు మటన్ పై కూడా కరోనా ప్రభావం ఉండబోతుందని అంటున్నారు. కొన్ని చోట్ల కోళ్ల పరిశ్రమలు నడిపించే వారు ఉచింతా కోళ్ల పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
ఇలా కోళ్ల పరిశ్రమకు తీరని దెబ్బగా తయారు అవుతుంది. మరోవైపు చికెన్, మటన్ తినడం వల్ల ఏలాంటి ప్రమాదాలు లేవని చెబుతున్నా జనాలు మాత్రం తమ ఆరోగ్యంపైనే దృష్టి పెడుతున్నారు. ఈ భయాన్ని పోగొట్టడానికి కొన్ని చోట్ల చికెన్, ఎగ్ మేళా పెడుతున్నారు. జనాల్లో అవగాహన కల్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ససేమిరా అంటున్నారు. తాజాగా తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లా పొన్నేరి ప్రజలు మాత్రం కరోనా భయాన్ని పక్కనపెట్టేసి అందినంత చికెన్ బిర్యానీ లాగించారు. అసలు విషయానికి వస్తే.. ఇక్కడ కొత్తగా ఓ హోటల్ ప్రారంభమైంది.
ప్రజలను ఆకర్షించేందుకు ప్రారంభోత్సవ ఆఫర్లో భాగంగా రూపాయికే చికెన్ బిర్యానీ అందిస్తున్నట్టు బోర్డులు పెట్టారు. అంతే ఒక్క రూపాయికే చికెన్ బిర్యానీ అనడంతో జనాలు ఒక్కసారే ఎగబడ్డారు.. క్యూలో బారులు తీరారు. దాంతో జనాలను అదుపు చేయడం హోటల్ యాజమాన్యానికి వీలు కాలేదు.. దాంతో పోలీసులకు కబురు పంపడగా జనాలను అదుపు చేయడానికి రంగంలోకి దిగడంతో నానా రచ్చ జరిగింది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు ప్రారంభం కాగా, రెండు గంటల్లోనే 120 కిలోల చికెన్ బిర్యానీ హాంఫట్ అయిపోయింది.