ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వన్సైడ్గా సూపర్ విక్టరీ కొట్టి అధికారంలో కొనసాగుతున్న వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలాచోట్ల అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంపిటిసి, జెడ్పిటిసి, మున్సిపాలిటీ, కార్పొరేషన్ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. అయితే చాలాచోట్ల ప్రతిపక్ష టీడీపీ నామినేషన్స్ వేయకపోవడంతో, వైసీపీకి ఎక్కువ ఏకగ్రీవాలు అవుతున్నాయి. కాకపోతే టీడీపీ బలంగా ఉన్న చోట్ల మాత్రం వైసీపీకి చుక్కలు చూపించేలా ఉంది.
ముఖ్యంగా కృష్ణా జిల్లాలో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇస్తుంది. ఈ పోటీ వల్ల ఇద్దరు మంత్రులు కాస్త భయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపించకోలేకపోతే పదవికి రాజీనామా చేసేయాలని సీఎం జగన్ కండీషన్ పెట్టిన నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్లు కాస్త టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరు మంత్రుల పరిధిలోనే జిల్లాలో ఉన్న రెండు కార్పొరేషన్స్ ఉన్నాయి. పేర్ని నాని మచిలీపట్నం, వెల్లంపల్లి విజయవాడ కార్పొరేషన్లని గెలిపించాల్సిన బాధ్యత ఉంది.
అయితే ఈ రెండు చోట్ల టీడీపీ స్ట్రాంగ్గా ఉంది. దీంతో మంత్రులు గెలుపు కోసం గట్టిగా కష్టపడుతున్నారు. కొత్తగా ఏర్పడిన మచిలీపట్నం కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉన్నాయి. ఈ 50 చోట్ల అధికార వైసీపీకి ధీటుగా టీడీపీ అభ్యర్ధులు నామినేషన్స్ వేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కార్పొరేషన్పై స్పెషల్ ఫోకస్ పెట్టి పని చేస్తున్నారు. వైసీపీ విజయాన్ని అడ్డుకోవడానికి ఆయన బాగా కష్టపడుతున్నారు. పైగా ఇక్కడ టీడీపీ కూడా కాస్త అనుకూల వాతావరణం ఉంది.
అటు విజయవాడలో టీడీపీకి బలమైన నాయకత్వం ఉంది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బొండా ఉమా, జలీల్ ఖాన్, వంగవీటి రాధాలు కార్పొరేషన్లో టీడీపీ గెలుపు కృషి చేస్తున్నారు. రాజధాని అమరావతి ప్రభావం కూడా విజయవాడ నగరంపై బాగా ఉంది. దీంతో ఇక్కడ టీడీపీకి గెలిచే అవకాశాలున్నాయి. మరి చూడాలి ఈ ఇద్దరు మంత్రుల్లో టీడీపీ ఎవరికి చెక్ పెడుతుందో?