కరోనా...ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న మహమ్మారి. ఈ వైరస్ ప్రాణాలను హరించడమే కాదు.. దేశాల ఆర్థిక వ్యవస్థలను తలకిందులు చేసేస్తోంది. కళ్లు మూసి తెరిచేలోగా లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది. ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ఈ వ్యాధికి మూలం, విస్తరణకు కారణం ఇప్పటివరకు కనుగొనబడలేదు. తాజాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం గబ్బిలాలే అంటూ నిపుణులు వివరాలు వెల్లడించారు.
చైనా సైంటిస్టు షీ జెంగ్లీ చైనాలోని వుహాన్ లో పరిస్థితి స్వయంగా పర్యవేక్షించిన అనంతరం ఈ మేరకు పలు విషయాలు వెల్లడించారు. జలుబు, దగ్గు, జ్వరాన్ని కలిగించే వైరసులు గబ్బిలాన్ని తాకినప్పుడు వాటికి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. ఆ సమయంలో వాటి శరీరంలో ఉత్పత్తి అయిన ఫ్రీ రాడికల్స్ వల్ల ప్రజలకు రోగాలు వస్తాయంటున్నారు. రాత్రిపూట మాత్రమే సంచరించే ఈ గబ్బిలాలు శరవేగంగా స్థావరాలను మార్చడం వల్లే వైరస్ వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. రోగుల రక్త నమూనాలు పరిశీలించి గబ్బిలాల వల్లే కరోనా కంట్రీలు దాటుతుందని జెంగ్లీ స్పష్టం చేశారు.
జన్యుపరంగా మనుషులకు, గబ్బిలాలకు సంబంధాలు లేకపోయినా..వాటి నుంచి వచ్చే వైరస్ లు మాత్రం ప్రాణాంతకంగా మారుతాయని జెంగ్లీ తెలిపారు. ఇదే విషయాన్ని బెర్కిలీ యూనివర్సిటీ పరిశోధకులు దృవీకరించారు. అయితే, సార్స్, జికా, మెర్స్, ఎబోలా లాగానే ఇది కూడా గబ్బిలాల నుంచే వస్తుందని ఎట్టకేలకు తేల్చినప్పటికీ... సార్స్, జికా, మెర్స్, ఎబోలా, కరోనా లాంటి వైరసులను గబ్బిలాలు ఎలా కట్టడి చేస్తున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయిందంటున్నారు.
కాగా, చైనాలో ప్రబలిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభించింది. కరోనా వైరస్తో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5,043 మంది ప్రాణాలు కోల్పోయారు.చైనాలో 3,177 మంది, ఇటలీలో 1,016, ఇరాన్లో 429, దక్షిణ కొరియాలో 71, స్పెయిన్లో 90, ఫ్రాన్స్లో 61, అమెరికాలో 41కి కరోనా మృతుల సంఖ్య చేరింది. గతేడాది డిసెంబర్లో చైనాలో ప్రబలిన ఈ వైరస్ 121 దేశాలకు సోకింది. కరోనా వైరస్ బాధితుల సంఖ్య లక్షా 36 వేల 385 మందికి చేరింది.