ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ...ఇప్పటి వరకు 120 దేశాలకు పైగా పాకిన మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కాటుకు5,416మంది బలి కాగా బాధితుల సంఖ్య 145, 361కు చేరింది. అత్యధికంగా చైనాలో మరణాలు సంభవించగా ఆ తర్వాత ఇటలీ, ఇరాన్ ఉన్నాయి. చైనాలో 3,177మంది చనిపోతే..80,824మంది చికిత్స పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు 1,33,970కి చేరుకున్నాయి. ఆయా దేశాల ప్రభుత్వాలు నివారణ చర్యలు వేగవంతం చేశాయి.
చైనా వెలుపల దేశాల్లో మొత్తం 53,163 కేసులు నమోదయ్యాయి. 1,782 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య, మరణాల్లో ఇటలీ రెండో స్థానంలో ఉండగా, ఇరాన్ మూడో స్థానంలో ఉన్నాయి. ఇటలీలో 1266మంది మృత్యువాత పడితే 17,660మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇరాన్ 514మంది మరణిస్తే.. 11, 364మంది చికిత్స పొందుతున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ఇరాన్ మరో సంచలన నిర్ణయంతో వార్తల్లోకి ఎక్కింది.ఇరాన్ వీధులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దేశంలో ప్రతీ పౌరుడికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి అంగీకరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాగా, రొమేనియాలో ఇప్పటి వరకు 70 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రొమేనియా ప్రధాని లుడోవిక్ ఒర్బాన్ క్వారంటైన్ (స్వీయ దిగ్బంధం)లో ఉన్నారు. ఆయన అధ్యక్షతన సోమవారం జరిగిన ఓ భేటీలో పాల్గొన్న ఓ సెనేటర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రధాని లుడోవిక్తోపాటు ఆ సమావేశంలో పాల్గొన్న చాలా మంది మంత్రులు, సభ్యులు ఐసొలేషన్లో ఉన్నారు.
కాగా, అగ్రరాజ్యం అమెరికాలో 48మంది చనిపోగా, రోగుల సంఖ్య 2100కు పెరిగింది. ఆస్ట్రేలియా హోం శాఖ మంత్రి ఈ మహమ్మారి బారిన పడ్డారు. స్పెయిన్ లో 133మందిని కరోనా కాటేస్తే బాధితుల సంఖ్య 5,232కు చేరింది. ఫ్రాన్స్ లో 79మంది మృతి చెందగా 3,661మంది చికిత్స పొందుతున్నారు. ఇక అమెరికా, పాకిస్థాన్, గ్రీస్,ఇటలీ, సౌత్ కొరియా, జర్మనీ, కెనడా, పాకిస్థాన్, సౌదీ దేశాలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి.