కరోనా వ్యాపించకుండా తెలంగాణ సర్కారు ముందు జాగ్రత్తగా కఠిన చర్యలు తీసుకుంటోంది. దీని ప్రభావం జనజీవనంపై బాగానే పడేలా కనిపిస్తోంది. తెలంగాణలో ఈ నెల 31 వరకు అన్ని రకాల విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 15 వ తేదీ నుంచి ఏమేం తెరచి ఉంటాయి.. ఏమేం మూసేస్తారో కేసీఆర్ స్వయంగా వివరించారు.
ఈ నెల 15 నుంచి ఈ నెల 31 వరకు జనసమ్మర్థ ప్రాంతాలను నియంత్రించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రకాల విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, సమ్మర్ క్యాంపులు మూసి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే అన్ని పరీక్షలు యథావిధిగా కొనసాగిస్తారు. ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో, రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఉన్నవారు పరీక్షలు అయ్యేంత వరకు అక్కడే ఉండొచ్చు. అక్కడ శానిటైజర్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
బహిరంగ సభలు, వర్క్షాపులు, ర్యాలీలు వంటివి అనుమతించరు. జిమ్ములు, పార్కులు, జూ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, మ్యూజియం, అమ్యూజ్మెంట్ పార్కులు, అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్లు రద్దు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సినిమా హాళ్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లు మూసివేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో మాత్రం యథావిధిగా నడుస్తాయి.
ప్రజలకు నిత్యావసరాల దృష్ట్యా సూపర్ మార్కెట్లు, మాల్స్ యథావిధిగా పనిచేస్తాయి. ఇక పెళ్లి మండపాలు కూడా మూసివేయాలని నిర్ణయించాం. అయితే ఇప్పటికే పెళ్లిళ్లు నిర్ణయమై ఉంటాయ్ కాబట్టి వాటిపై నిషేధం నిలిపివేశారు. 200 మంది మించకుండా వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 31 వరకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు. మార్చి 31 తర్వాత మ్యారేజ్ హాల్స్కు కూడా అవకాశం లేదు.