కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది ? మానవాళికి ఎలా సోకింది ? అది ఎలా వ్యాపించింది ? ఈ ప్రశ్నలకు సమాధానమిస్తోంది ఓ చైనా మహిళ. ఇంతకీ ఆమె చెబుతున్న ఆ సీక్రెట్ ఏంటి?
కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ ఎలా వచ్చిందన్న దానిపై ఇప్పటికే చైనా, అమెరికా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరి, అసలీ కరోనా ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? మూలాలు ఏమిటి? అని కనుక్కునేందుకు చాలా మంది శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగల అతి కొద్దిమంది శాస్త్రవేత్తల్లో షి- జెంగ్లీ ఒకరు. చైనాలో ఆమెను 'బ్యాట్ ఉమన్' అని పిలుస్తారు. వుహాన్ నగరంలో మొదటిసారి కరోనా వైరస్ లక్షణాలు కనిపించగానే ఈ బ్యాట్ ఉమన్ను సంప్రదించారు చైనా అధికారులు. షి-జెంగ్లీ కరోనా వైరస్లపై విస్తృతంగా పరిశోధనలు చేసింది. ఇందుకోసం ఆమె చైనాలోని గుహల్లో రోజుల తరబడి.. ఎన్నో గబ్బిలాల రక్త నమూనాలను సేకరించింది. వాటిపై ఎన్నో పరీక్షలు నిర్వహించింది. ఎంతో కష్టపడి వాటి జన్యుపటాలను రూపొందించింది. వాటి ఆధారంగా.. ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న కోవిడ్-19 మాత్రమే కాదు... ఇంతకుముందు చాలా దేశాలను అల్లాడించిన సార్స్, ఎబోలాల వెనక కూడా కరోనా వైరసే ఉందని, వాటి వ్యాప్తికి గబ్బిలాలే కారణమని షి- జెంగ్లీ నిర్ధారించింది.
2003లో సార్స్ ప్రపంచాన్ని వణికించింది. ఆ వైరస్ సోకిన వాళ్లలో దాదాపు పదిశాతం మంది చనిపోయారు. ఆ సమయంలోనే ఈ వైరస్ మూలాల వేట ప్రారంభించింది షి-జెంగ్లీ. చివరకు ఆమె ప్రయత్నాలు యునాన్ నగరంలోని గుహల్లో ఫలించాయి. అక్కడి గుహల్లోని గబ్బిలాల్లో సార్స్ మూలాలని కనుక్కుంది. గబ్బిలాల నుంచి కరోనా వైరస్లు ఇతర జంతువులకు వ్యాపిస్తున్నాయని ఆమె పరిశోధనల్లో తేలింది.
చైనీయులు ఎక్కువగా జంతు మాంసాన్ని తింటారు. ఈ ఆహార లక్షణాలే.. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమంటోంది షీ జెంగ్లీ. ఆమె సూచనలతోనే జంతువుల అమ్మకాలు, కొనుగోళ్లపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది.