కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను గజగజలాడిస్తుంది. ఇప్పటికే కరోనా మృతుల సంఖ్య 5 వేలకు పైగా దాటింది. ఈ వైరస్ సోకిన వారు లక్షకుపైగా ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడోకక్కడ ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో కరోనాను రూపుమాపేందుకు మందును కొనుగొనే ప్రయత్నాలు శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. అయితే భయపెడుతున్న కరనా వైరస్ నుంచి బయపడేందుకు గోమూత్రం చక్కని ఔషధంలా పనిచేస్తుందని అఖిల భారతీయ హిందూ మహాసభ పేర్కొంది.
ఈ మేరకు ‘గోమూత్ర పార్టీ’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో స్వామి చక్రపాణి మహరాజ్ సహా ఆయన బృంద సభ్యులు గోమూత్రాన్ని తాగారు. చక్రపాణి మాట్లాడుతూ.. ‘‘గోమూత్రం, పేడతో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. శరీరానికి ఆవు పేడ రాసుకుని ఓం నమః శివాయ అని దేవుడిని స్మరిస్తారో వారు ఈ ఇన్ఫెక్షన్ నుంచి సురక్షితంగా ఉంటారు. కరోనా వైరస్ను అంతం చేసేందుకు త్వరలో ప్రత్యేక యాగం నిర్వహించనున్నాం’’ అని తెలిపారు. మరోవైపు తాము 21 సంవత్సరాల నుంచి గోమూత్రం తాగుతున్నామని, ఆవు పేడతో స్నానం చేస్తున్నామని పార్టీకి హాజరైన ఓ వ్యక్తి వెల్లడించాడు.
మరియు కేన్సర్ను నివారించేందుకు గోమూత్రం చక్కని ఔషధంలా పనిచేస్తుందని కార్యక్రమానికి హాజరైన బీజేపీ నేతలు కూడా తెలిపారు. అంతేకాదు, కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 200 మంది కూడా గోమూత్రాన్ని తాగారు. ప్రస్తుతం దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. అయితే దీనిపై స్పందించిన సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. `గుడ్డివాళ్లు ఇకనైనా మేల్కొంటారా? గోమూత్రం అన్ని రోగాలను నయం చేస్తుందన్న చెత్త ప్రచారాన్ని ఆపండి. మీరు ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల్లో మతాలను, కాషాయ రంగును ప్రవేశపెట్టొద్దు. చదువుకోని పేదలను తప్పుదోవ పట్టించొద్దు` అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.