ఎన్నో వివాదాలకు నెలవు అయి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితమే ఎన్నో వివాదాలకు, సంచలనాలకు కేరాప్ గా మారిపోయింది. యూపీలోని గోరఖ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి వరుసగా బీజేపీ తరపున ఐదుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన ఆర్ ఎస్ ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో బీజేపీ తిరుగులేని మెజార్టీతో ఘనవిజయం సాధించింది. ఆ టైంలో ఎంతో మంది ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడినా చివరకు మోడీ, అమిత్ షా అవివాహితుడు.. పార్టీలో దూకుడుగా ఉంటాడన్న నేపథ్యంలో ఆదిత్యకు ఛాన్స్ ఇచ్చారు.
అప్పటి నుంచి ఆదిత్యనాథ్ ఎన్నో నిర్ణయాలతో దేశవ్యాప్తంగా సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్ అయ్యారు. గోవుల విషయంలో యోగి పేరు చెపితే దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఒకానొక టైంలో మోడీ తర్వాత ఆయనే ప్రధానమంత్రి అన్న టాక్ కూడా వచ్చింది. ఇక యూపీ ముఖ్యమంత్రిగా వరుసగా మూడేళ్లు పూర్తి చేసుకున్న ఏకైక బీజేపీ సీఎంగా రికార్డులకెక్కారు. 2017లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ యూపీలో ఉన్న 405 అసెంబ్లీ స్థానాల్లో 312 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే ఏడాది మార్చి 15న యూపీ ముఖ్యమంత్రిగా యోగి బాధ్యతలు స్పీకరించారు.
ఇక ఈ రోజుతో ఆదిత్య నాథ్ మొత్తం మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నట్లైంది. గతంలో ఇదే యూపీలో బీజేపీ తరఫున కళ్యాణ్ సింగ్, రామ్ ప్రకాశ్ గుప్తా, రాజ్నాథ్ సింగ్లు సీఎంగా పనిచేసినప్పటికీ.. ఎవరూ కూడా మూడేళ్లు పదవిలో కొనసాగలేకపోయారు. గత ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో తన పదవికి ఎలాంటి ఆటంకం కలగకుండా.. యోగి సీఎం పదవిలో కొనసాగుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లోనూ యోగినే తిరిగి సీఎంగా కొనసాగించాలని బీజేపీ జాతీయ నాయకత్వం యోచన చేస్తోంది.