మధ్యప్రదేశ్లో పొలిటికల్ హైడ్రామా సోమవారం పరాకాష్టకు చేరనుంది. బలపరీక్ష కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పట్టుబడుతుండటంతో ఉ త్కంఠను రేపుతున్నది. 22 మంది అసమ్మతి ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం కీలకం కానున్నది. బడ్జెట్ సమావేశాలు ఆరంభమయ్యే రోజే ముఖ్యమంత్రి కమల్నాథ్ సర్కారు బల పరీక్షను ఎదుర్కోనుండటంతో సర్కత్రా ఆసక్తి రేపుతోంది. ప్రభుత్వమే మైనార్టీలో పడితే... ఇంకా నిర్ణయాలు తీసుకునే అధికారం దానికి ఎక్కడ ఉంటుందని బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
సభలో తన ప్రసంగం పూర్తవ్వగానే బలపరీక్షను నిర్వహించాలని గవర్నర్ లాల్జీ టాండన్ శనివారం అర్ధరాత్రి సీఎం కమల్నాథ్కు లేఖ పంపించారు. ఆ లేఖలో ఆయన పేర్కొన్న అంశాలను బట్టి బలపరీక్ష తథ్యమని తెలుస్తోంది. ‘‘మీ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లుగా మీడియా ద్వారా తెలిసింది. స్పీకర్కు రాజీనామా లేఖలు పంపడానికి ముందే.. ఈ నెల 10న వారు నాకు కూడా సమాచారం అందించారు. మీ సర్కారు మైనారిటీలో ఉందంటూ బీజేపీ నుంచి కూడా నాకు లేఖ అందింది. సోమవారం సభలో నా ప్రసంగం అయిన వెంటనే బలపరీక్షకు ఏర్పాట్లు చేయండి. దీన్ని వాయిదా వేయడానికి, పొడిగించడానికి, రద్దు చేయడానికి వీల్లేదు’’ అనేది గవర్నర్ లేఖలోని సారాంశం. అయితే గవర్నర్ లేఖ కాంగ్రెస్లో కలకలం రేగింది. వెంటనే జైపూర్లోని క్యాంపుల్లో ఉన్న తమ ఎమ్మెల్యేలను హుటాహుటిన భోపాల్కు రప్పించింది. తమ ఎమ్మెల్యేలంతా సోమవారం ఉదయమే శాసనసభలో అందుబాటులో ఉండాలంటూ విప్ జారీ చేసింది. అటు బీజేపీ కూడా తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది.
ఇప్పటికే ఆరుగురు కేబినెట్ మంత్రుల రాజీనామాలను స్పీకర్ ఆమోదించడంతో మెజార్టీ మార్కు 113కు పడిపోయింది. కమల్నాథ్ సర్కార్ బలం దీనికంటే రెండు అంకెలు ( ఇద్దరు ఎమ్మెల్యేలు) తక్కువగానే ఉంది. ఒకవేళ అందరి రాజీనామాలు స్వీకరిస్తే మెజార్టీ మార్కు 104కు చేరుతుంది. 107 మంది చట్టసభ్యుల మద్దతు ఉన్న బీజేపీ సర్కార్ను ఏర్పాటు చేసేందుకు వీలు కలుగుతుంది.