పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల కరోనా నేపథ్యంలో చైనీయుల ఆహారపు అలవాట్లపై ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇండియా-పాక్ మధ్య వాతావరణంపై ఆయన స్పందించారు. భారత్ యుద్ధాన్ని కోరుకోదని, పాకిస్థాన్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉంటుందని షోయబ్ అక్తర్ అన్నాడు.
టీవీల్లో చూసినప్పుడు మాత్రం రెండు దేశాల మధ్య రేపే యుద్ధం జరుగుతుందన్నట్లు అనిపిస్తుందని.. కానీ వాస్తవానికి భారత్ యుద్ధం కోరుకోదని అన్నారు. నేను దాదాపు ఇండియా మొత్తం తిరిగాను. భారత్ ఒక అద్భుతమైన దేశం. అక్కడి ప్రజలను చాలా దగ్గరి నుంచి చూశాను. భారతీయులు చాలా మంచివాళ్లు. ఎల్లప్పుడూ పాకిస్థాన్ను స్వాగతిస్తూనే ఉంటారని ప్రశంసించారు.
భారతీయులు పాక్తో కలిసి పని చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. యుద్ధాన్ని అసలే కోరుకోరు. కానీ, భారత్ పురోగతి పాకిస్థాన్తో ముడిపడి ఉందని నా నమ్మకం అని అక్తర్ అన్నారు. కరోనా వల్ల భారత్లో ఐపీఎల్ రద్దయితే ఇండియా భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని అక్తర్ అన్నాడు.
ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాపించడం దురదృష్టకరం. పాకిస్థాన్ ప్రిమియర్ లీగ్ను కుదించాల్సి వచ్చింది. ఐపీఎల్ అయితే ఏకంగా రద్దయ్యేలా ఉందంటూ షోయబ్ అక్తర్ కామెంట్ చేశాడు. పాక్ - ఇండియా మధ్య ఇలా క్రికెటర్లు, సినీతారలు మంచి వాతావరణం క్రియేట్ చేయడం ఆహ్వానించతగ్గ పరిణామం.