ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. దేశాల మధ్య సంబంధాలు కూడా మెరుగుపరుస్తోంది. ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. మొన్ననే ప్రధాని మోడీ సార్క్ దేశాల కోసం కోటి డాలర్లు సాయం అందించేందుకు భారత్ సిద్ధమని ప్రకటించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఆలీ బాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా ముందుకొచ్చారు.
జాక్ మా ఫౌండేషన్, ఆలీబాబా ఫౌండేషన్ సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడిన దేశాలకు సాయం చేస్తున్నాయి. వైద్యపరికరాలు అందిస్తున్నాయి. ఇప్పటికే, జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్ దేశాలకు విరాళాన్ని అందించాయి. జాక్ మా ఇప్పుడు అమెరికాకు సాయం చేస్తున్నారు.
అమెరికాకు మాస్కులను, కరోనా పరీక్షల కిట్లను పంపిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో ఉన్న మిత్రులందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ కరోనాపై పోరుకు సాయం చేసుకుందామన్నారు. ఆయన ప్రకటనకు స్వల్ప వ్యవధిలోనే భారీగా అభిమానులు స్పందించారు.
కరోనా తీవ్రత ఎక్కువున్న అమెరికాకు దాదాపు 5లక్షల కిట్లను, పది లక్షల మాస్కులకు ప్రత్యేక విమానంలో పంపించారు. తమకు చేస్తున్న సాయానికి జాక్ మా ను చాలామంది అమెరికన్లు అభినందిస్తున్నారు. జాక్ మా.. తన అలీబాబా ఈ కామర్స్ తో కొద్ది కాలంలోనే ప్రపంచంలోనే సంపన్నుడిగా మారారు.