ఇటీవ‌ల కాలంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దేశంలో ఆడ‌వాళ్ల‌ భద్రత గాల్లో దీపంలా తయారైంది. ప్రస్తుతం వారిపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు యావత్‌ దేశాన్ని ఆలోచనలో పడేసింది. చిన్నారులు, మహిళలపై దాడుల నిరోధానికి ఇప్పటికే పోక్సో చట్టం అమలులో ఉండగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. అయిన‌ప్ప‌టికీ మాన‌వ మృగాల్లో మార్పు రావ‌డం లేదు. అలాగే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ లో దిశ అత్యాచారం, హత్య ఘటన తాలూకా ఉదంతం జరిగి నాలుగైదు నెలలు గడుస్తున్నా... ఎవరూ మర్చిపోలేదు. 

 

కాగా.. అచ్చం అలాంటి సంఘటనే తెలంగాణ‌లో ఇప్పుడు మరోటి చోటుచేసుకుంది. యువతిపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మహిళ ఒంటిపై దుస్తులు లేకపోవడం, తలపై బండరాయితో మోది ఉండటం.. అచ్చంగా దిశ ఘటనను తలపించింది.  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఈ దారుణం జరిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం తంగడపల్లి శివారులోని వంతెన కింద గుర్తు తెలియని యువతి(30) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

 

ఘటనా స్థలంలో మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్యచేసిన ఆనవాళ్లు ఉండటంతో అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏమీ లేకపోవడంతో, అక్కడికి వచ్చే మార్గంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా, మహిళను హత్య చేశాక దుండగులు ఆమెకు సంబంధిన ఆనవాళ్లు ఏమీ లేకుండా జాగ్రత్త పడ్డారని, ఆ నేరంలో ఎంత మంది పాల్గొన్నారనే అంశంపైనా స్పష్టత లేదు. దీంతో పాటు హత్యకు గురైన యువతి ఏ ప్రాంతానికి చెందినదో కూడా తెలియడం లేదు.  ప్ర‌స్తుతం కేసు న‌మోదు చేసిన పోలీసులు శ‌ర‌వేగంగా ద‌ర్యాప్తు చేప‌ట్టారు.
 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: