ఏపీలో బాబోరి తెలుగుదేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరో అదిరిపోయే షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు కర్నూలు జిల్లాలో నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సైకిల్ దిగి వైసీపీ గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటికే వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి తో భేటీ అయ్యారు. పార్టీ మార్పు అంశంపై సైతం జనార్దన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి తో చర్చించారని కూడా తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసి విజయం సాధించిన జనార్దన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి అఖిలప్రియ... నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తన మామ అయిన కాటసాని రామిరెడ్డి కి పదేపదే సపోర్ట్ చేస్తూ వచ్చారు.
దీనిపై జనార్దన్ రెడ్డి అప్పట్లో చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అసంతృప్తి ఉండేది. బనగానపల్లె ఎమ్మెల్యేగా ప్రస్తుతం కాటసాని రామిరెడ్డి ఉన్నారు, ఈయన వైసీపీ తరపున ఎన్నికయ్యారు. ఆయన కుమార్తె ఎవరో కాదు నంద్యాల మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి భార్య. ఇక ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన టీడీపీ నుంచి గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్ చేశారు.
మొన్నటి ఎన్నికల్లో కాటసాని గెలుపుకోసం చల్లారామకృష్ణారెడ్డి, బిజ్జం పార్థసారథిరెడ్డి కృషి చేశారు. దీంతో చల్లాకు ఎమ్మెల్సీని చేశారు జగన్. బిజ్జంకు ఏదో ఒక నామినేటేడ్ పదవి ఇస్తారని తెలుస్తోంది. ఇక ఇదే నియోజకవర్గానికి చెందిన యర్రగొండ వెంకటేశ్వరరెడ్డిని జడ్పీ ఛైర్మన్ పదవి వరిస్తుందని సమాచారం. ఇక్కడ ఇప్పటికే ఉన్న నలుగురు కీలక నేతలు వైసీపీలోనే ఉన్నారు. ఇప్పుడు బీసీ జనార్థన్ రెడ్డి సైతం టీడీపీని వీడితో ఈ నియోజకవర్గంలో టీడీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడం ఖాయం. ఇక కర్నూలు జిల్లాలో ఇది బాబుకు పెద్ద మైనస్సే అని చెప్పాలి.