తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి . కానీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు కంపోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ ) నివేదిక మాత్రం సభ ముందుకు రాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది . గడిచిన ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ విభాగాలు చేసిన తప్పులను కాగ్ ఎత్తి చూపడం తెల్సిందే . రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపే కాగ్ నివేదిక ను విపక్షాలు తమ ఆయుధంగా మలచుకోవడం పరిపాటి . కాగ్ ఎత్తి చూపే తప్పిదాల కోసం ప్రతిపక్షాలు కాచుకుని కూర్చుంటాయి . కానీ ఈసారి తెలంగాణ లో ప్రతిపక్షాలకు ఆ అవకాశం లేకుండా పోయింది .
దానికి కారణం ఏమిటన్నదానిపై ఆరా తీస్తే... బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20 వరకు కొనసాగించాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయింది . అయితే కరోనా వైరస్ కారణంగా బడ్జెట్ సమావేశాలను నాలుగు రోజుల ముందుగానే ముగించడం వల్లే , కాగ్ నివేదిక అసెంబ్లీ లో టేబుల్ కాలేదని తెలుస్తోంది . అందుకే కాగ్ నివేదిక సభ లో ప్రవేశపెట్టలేదన్న వాదనలు విన్పిస్తున్నాయి . కాగ్ నివేదిక టేబుల్ కాకపోవడం పట్ల విపక్షాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి . గత ఆర్ధిక సంవత్సరం లో రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో తీవ్ర అవినీతి , అవకతవకలు జరిగాయని విపక్షాలు అంటున్నాయి .
అదే కాగ్ నివేదిక టేబుల్ అయి ఉంటే, ప్రభుత్వ విభాగాలు చేసిన అవినీతి , అక్రమాలు ప్రజల ముందుకు వచ్చి ఉండేవని అంటున్నారు . గత ఆర్ధిక సంవత్సరం లో ప్రభుత్వ విభాగాలు పెద్ద ఎత్తున అవినీతి , అక్రమాలకు పాల్పడ్డాయని కాగ్ నివేదిక ఆధారంగా వాటిని బహిర్గతం చేసే అవకాశం లేకుండా పోయిందని విపక్షాలు పేర్కొంటున్నాయి . కాగ్ నివేదిక వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభకు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి .