సీ ఏ ఏ, ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం , మైనార్టీలను తమవైపు తిప్పుకోవడం లో ఒకింత సక్సెస్ అయ్యారు . దేశం లో ఏ ముఖ్యమంత్రి చేయనంత స్పష్టంగా సీ ఏ ఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ కేసీఆర్ తీర్మానం చేశారంటూ అసెంబ్లీ వేదిక ఎం ఐ ఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్న విషయం తెల్సిందే . అయితే సీ ఏ ఏ, ఎన్ఆర్సీ ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం ద్వారా ముస్లిం , మైనార్టీల్లో కేసీఆర్ కు ఏర్పడిన ఇమేజ్ ను బీజేపీ నేతలు మరింత పెంచే ప్రయత్నాన్ని చేస్తున్నట్లు కన్పిస్తోంది .
దేశ వ్యాప్తంగా విపక్షాలు సీ ఏ ఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తున్నాయి . బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సీ ఏ ఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి . ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేయగా , తాజాగా తెలంగాణ సర్కార్ కూడా సీ ఏ ఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయడంతో రాష్ట్ర కమలనాథులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు . సీ ఏ ఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయడమంటే దేశ ద్రోహమేనని , అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ , ఎంపీలు ధర్మపురి అరవింద్ , సొయం బాబురావు లు డిమాండ్ చేస్తున్నారు .
అయితే సీ ఏ ఏ, ఎన్ఆర్సీ లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలెన్నీ తీర్మానాలు చేసిన వచ్చే నష్టమేమి లేకపోయినప్పటికీ , రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానంపై కమలనాథులు అత్యుత్సాహం తో విమర్శలు చేస్తున్నారు . దీనితో సీ ఏ ఏ, ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా తీర్మానం చేసిన కేసీఆర్ పట్ల మైనార్టీల్లో సానుకూల దృక్పధం ఏర్పడే విధంగా బీజేపీ నేతలే పరోక్షంగా వ్యవహరిస్తున్నట్లవుతోంది .