ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కానున్నారా... ప్రభుత్వంలో ఆమెకు కీలక పదవి దక్కనుందా.. అంటే టీఆర్ ఎస్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. శాసనమండలి నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వ కుంట్ల కవిత బుధవారం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురువారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ము గియనుండగా, బుధవారం ఉదయం కవిత పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ నుంచి పలువురు ఆశావహులు టికెట్ ఆశించినా అనూహ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం కవిత అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపారు.
2014 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థిగా కవిత పోటీ చేసి ఘన విజయం సాధించారు. తెలంగాణ సమస్యలపై పలుమార్లు పార్లమెంట్లో గళమెత్తి, దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. అటు పార్టీలో కూడా కేసీఆర్ కూతురుగానే కాకుండా తనకంటూ సొంత ఇమేజ్ను సృష్టించకుంది. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి రెండో సారి పోటీ చేసిన కవిత అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్పై ఓటమిపాలయ్యారు. ఇక అప్పటి నుంచి టీఆర్ ఎస్ కార్యకలాపాలకు, జిల్లాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే కవితకు కీలక పదవి దక్కుతుందని, రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఇటీవల కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
టీఆర్ ఎస్కు సరిపడా మెజార్టీ ఉండటంతో కవిత పెద్దల సభలో అడుగుపెట్టం ఇక లాంఛనమే.. అయితే ఎమ్మెల్సీ పదవీ కాలం కేవలం 20 నెలలు మాత్రమే ఉండగా, కవితను ఎంపిక చేయడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గంలోకి కవితను తీసుకుంటారనే జిల్లాలో ప్రచారం జరుగుతోంది. అంతేగాక కీలకమైన శాఖను కూడా తనకు అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది. అందుకోసమే ఎమ్మెల్సీగా ఆమె అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేశారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు సైలెంట్ ఉన్న కవిత ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో మళ్లీ చక్రం తిప్పడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.