ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంతో ఓ రేంజ్లో రాజకీయ రచ్చ నడిచింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ది చంద్రబాబుది ఒకే సామాజిక వర్గం కావడంతో చంద్రబాబు పార్టీ మునిగి పోతుందనే రమేష్ కుమార్ ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేశారని.. అదేమంటే తనకు ఉన్న విచక్షణ అధికారం అంటారని సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై చంద్రబాబు సైతం కౌంటర్ ఇచ్చారు. ఈ ముఖ్యమంత్రికి ఎన్నికలు కావాలే కాని.. ప్రజల ప్రాణాలు వద్దా ? అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
స్థానిక ఎన్నికల్లో వైసీపీ భారీ ఏకగ్రీవాలతో జోరు మీదున్న టైంలో ఎన్నికల వాయిదా ఆ పార్టీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇక దీనిపై వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం దీనిపై సుప్రీంకోర్టులో గంట పాటు విచారణ కొనసాగింది. ఎన్నికలను వాయిదా వేయడం అనేది ఎన్నికల కమిషన్కు ఉన్న విచక్షణ అధికారం అని.. ఇప్పుడు కరోనా వైరస్ బాగా విస్తరిస్తోన్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయడం కరెక్టే అని ధర్మాసనం అభిప్రాయ పడింది. అదే టైంలో ఎన్నికల నిర్వహణ అనేది పూర్తిగా ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఉంటుందని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.
అయితే ఓ విషయంలో మాత్రం సుప్రీం సీఎం జగన్ నిర్ణయానికి ఓటేసింది. ఎన్నికల కోడ్ వెంటనే ఎత్తి వేయాలని.. అభివృద్ధి పనులకు ఆటంకం కలగకూడదని చెప్పింది. సుప్రీం నిర్ణయం ప్రకారం ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో భూ పంపిణీకి అడ్డు తొలగింది. ఎన్నికలు వాయిదా వేస్తే తదుపరి ఎన్నికల కార్యాచరణ ప్రారంభమయ్యే వరకు కోడ్ ఉండకూడదని చెప్పింది. కోడ్ను అప్పటి వరకు కోనసాగించాలని ఈసీ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఈసీ రమేష్ కుమార్కు చిన్న మెట్టికాయ లాంటిదే అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి దీనిపై జగన్ ప్రభుత్వంతో పాటు .. ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో ? చూడాలి.