సృష్టిలోని ప్రతీ తల్లికి తన బిడ్డ అపురూపమే. ప్రాణాలు పణంగా పెట్టి జన్మనిచ్చిన తన పాపాయికి చిన్న ఆపద కలిగినా అమ్మ మనసు తట్టుకోలేదు. అలాంటిది తాను పెంచి పెద్ద చేసి తన కూతురును డాక్టర్ను చేద్దామనుకున్న ఆ తల్లి ఆశలను ఆరుగురు మృగాళ్లు చిదిమేశారు. తన కుమార్తెపై అత్యంత పాశవికంగా లైంగీక దాడి చేసి అత్యాచారం చేసి చంపేశారు. అలా ఆశాదేవికి ఆ ఆరుగురు మృగాళ్లు గర్భశోకం మిగిల్చారు. తన కుమార్తెను చంపేసి ఆమె భావి భారత కలలను చిద్రం చేసి.. తనకు పుత్రికా శోకం మిగిల్చిన ఆ దోషులపై ఆ తల్లి చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది.
నిర్భయ దోషులు నలుగురికి శుక్రవారం ఉదయం ఉరి శిక్ష అమలు చేశారు. ఎనిమిది సంవత్సరాలుగా ఈ శిక్ష నుంచి తప్పించుకునేందుకు.. బయట పడేందుకు నిర్భయ దోషులు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అయితే చివరి ప్రయత్నాలు అన్ని మూసుకు పోవడంతో చివరకు శుక్రవారం ఉదయం 5. 30 గంటలకు వీరికి ఉరి శిక్ష అమలు చేశారు. ఇక మొత్తం ఈ కేసులో ఆరుగురు నిందితులు దోషులుగా తేల్చారు. అయితే ప్రధాన నిందితుడు అయిన రామ్సింగ్ తిహార్ జైలులోనే గతంలో శిక్ష అనుభవిస్తూనే ఆత్మహత్య చేసుకున్నారు.
ఇక మైనర్ అయిన ఓ నిందితుడిని శిక్ష తర్వాత వదిలి పెట్టారు. ఇక నిర్భయ దోషులకు ఉరి శిక్ష కోసం గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తోన్న ఆమె తల్లి ఆషాదేవి ఎట్టకేలకు వీరికి ఉరి పడడంతో హర్షం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా ఆమె పదే పదే పోరాటాలు చేయడం.. మరోవైపు వీరి శిక్ష చాలా సార్లు వాయిదా పడుతూ వస్తండడంతో అసలు వీరికి ఉరి శిక్ష పడుతుందా ? నిర్భయకు న్యాయం జరుగుతుందా ? అన్న సందేహాలు కూడా కలిగాయి. అయితే చివరకు ఉరి శిక్ష అమలు అవ్వడంతో ఇప్పుడు నిర్భయ తల్లి ఆషాదేవితో పాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.