పాపం ఒకరిది ఫలితం మరొకరిది అంటారు.. ఇప్పుడు ఇలటీ పాలిట శాపంగా మారింది కరోనా (కోవిడ్19) వైరస్. చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తుంది. ఈ కరోనా భూతం 177 దేశాలకు విస్తరించింది. వ్యాధి బారిన 2,20,313 మంది పడగా, ఇప్పటివరకూ నమోదైన మృతుల సంఖ్య 9,800 దాటిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ తాకిడి చైనాలో తగ్గు ముఖం పట్టినా.. ఇతర దేశాల్లో మాత్రం రోజు రోజుకీ ప్రబలిపోతుంది. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన అన్ని దేశాలూ, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నా, ప్రజల సహకారం లేక, వ్యాధి విస్తరిస్తోందని, చైనా తరహాలో వైరస్ అణచివేత కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
కరోనా వైరస్ మొన్నటి వరకు చైనాను వణికించినా.. ఇప్పుడు ఇటలీకి తాకింది. ప్రస్తుతం కరోనా వైరస్ ఇటలీని అతలాకుతలం చేస్తోంది. ఒక్క నెలలోనే ఆ దేశంలో ఈ మహమ్మారి కారణంగా మృతి చెందినవారి సంఖ్య 3,405కు చేరుకుంది. ఇటలీలో 24 గంటల వ్యవధిలోనే 427 మరణాలు సంభవించడం అక్కడి తీవ్రతకు అద్దంపడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ వైరస్ నుంచి మాత్రం తప్పించుకోలేక పోతున్నారు. ఇప్పటికే వాణిజ్య వ్యవస్థపై పడిన ఈ ప్రభావం మనుషులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.
చైనా తర్వాత ఇటలీ, ఇరాన్, స్పెయిన్ దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. స్పెయిన్లో మరణించిన వారి సంఖ్య 209 నుంచి ఒక్కసారిగా 767కు పెరగడం గమనార్హం. ప్రస్తుతం భారత దేశంలో కూడా ఈ కరోనా పంజా విసురుతుంది. ఇప్పటికే కేంద్రం అన్ని రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తగు సూచనలు ఇచ్చిన విషయం తెలిసిందే.