ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు కొంతమంది పదవి కోసం ఎలాంటి దారుణాలకు చేయడానికైనా వెనుకాడటం లేదు. ఇక పదవి ని దక్కించుకోడానికి ఎన్ని నాటకాలైన ఆడుతున్నారు. కొన్ని కొన్ని సార్లు అచ్చం సినిమాల్లో లాగానే నిజ జీవితంలో ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఓ రాజకీయ నాయకుడు అలాంటిదే చేశాడు. రెండు రోజుల క్రితం నందగోపాల్ అనే వ్యక్తి దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు అతని పై కత్తితో దాడి చేసారు . ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.దాడిని నిరసిస్తూ బిజెపి నాయకులు ఆందోళనకు దిగారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక అంతా సవ్యంగా సాగి పోతుంది అనుకుంటున్నా సమయంలో నందగోపాల్ డ్రైవర్ కారణంగా అసలు విషయం బయట పడిపోయింది.
నందగోపాల్ పై కత్తులతో దాడి వెనుక అతని నీచ బుధ్ధి బయట పడింది. అతని కారు డ్రైవర్ చెప్పిన వివరాలు తెలిసి అందరూ షాక్ కి గురయ్యారు. కత్తులతో దాడి జరిగింది అన్న సానుభూతితో పార్టీలో కీలక పదవులు పొందాలని ఆశించాడు నందగోపాల్. తన పై హత్యా యత్నం జరిగింది అని సానుభూతి కలిగించుకునేందుకు ఇంత నాటకం ఆడారు. వివరాల్లోకి వెళితే.. తిరుపూర్ సమీపంలోని కనక్కం పాలయంలో నివసిస్తున్న నందగోపాల్... అదే ప్రాంతంలో ఎలక్ట్రికల్ వస్తువుల దుకాణం నడుపుతున్నాడు... అంతే కాకుండా హిందూ మున్నాని జిల్లా శాఖ డిప్యూటీ కార్యదర్శి గా పని చేస్తున్నాడు నందగోపాల్. అయితే నందగోపాల్ బీజేపీ పార్టీలో కీలక పదవులు పొందాలని అనుకున్నాడు. అలా జరగాలంటే పార్టీ అధిష్టానానికి తనపై సానుభూతి కలిగేలా హత్యాయత్నానికి చిత్రీకరించాలని ఆలోచన చేసాడు.
నందగోపాల్ సూచన మేరకే డ్రైవర్ రుద్రమూర్తి కత్తితో నందగోపాల్ వీపు పై దాడి చేశాడు... ఇక ఆ తర్వాత నందగోపాల్ స్వయంగా కత్తితో తన రెండు చేతుల పైన కోసుకొని రక్తం కారుతున్న సమయంలో ఆస్పత్రిలో చేరాడు. ఇక ఈ విషయాన్ని నందగోపాల్ కార్ డ్రైవర్ కాస్త బట్టబయలు చేయడంతో నందగోపాల్ నిజ స్వరూపం బయటపడింది. ఇక డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందగోపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక లొంగిపోయిన కారు డ్రైవర్ రుద్రమూర్తి కోర్టులో హాజరు పరచి జైలుకు తరలించారు.