వార్తకు-వ్యాఖ్యానికి, వార్తకు-వదంతికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందనే విషయం తెలియన మీడియా ప్రతినిధులు, మీడియా అధినేతలు ఉన్నారని ఎవరూ అనుకోరు. కానీ, ఏపీలో జరుగుతున్న పరిణామాలు, ఓ వర్గం మీడియా వ్యవహరిస్తున్న తీరు వంటివి ఇప్పుడు ప్రజలకు సంకటస్థితిని తెచ్చిపెడుతున్నాయి. ఏది వార్తో.. ఏది వ్యాఖ్యానమో, ఏది వార్తో.. ఏది వదంతో కూడా తెలియకుండా ప్రదాన పత్రికలుగా చలామణి అవుతున్న మీడియా భారీ ఎత్తున ప్రభుత్వంపై వండి వారుస్తున్న వ్యతిరేక వార్తలపై ప్రజలు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. సోషల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్లు పెడుతున్నారు.
తాజాగా రెండు పరిణామాలు రాష్ట్ర మీడియాలో చోటు చేసుకున్నాయి. ఒకటి కరోనా వైరస్ విషయంలో ఓ వర్గం మీడియా వెలువరించిన కథనం, రెండోది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాసి నట్టుగా జరుగుతున్న లేఖ ప్రచారం. ఈ రెండు విషయాల్లోనూ నిబద్ధత లేకుండానే ఓ వర్గం మీడియా ము ఖ్యంగా టీడీపీ అనుకూల మీడియా వండివార్చిన కథనాలపై ప్రజలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోస్తు న్నారు. ముందు కరోనా విషయాన్ని తీసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తిపై దేశంలోనే ఏ రాష్ట్రం కూడా తీసుకోని విధంగా చర్యలు తీసుకున్న విషయం మీడియాకు తెలియంది కాదు. గ్రామాలు, పట్టణాలు నగరాలు సహా అన్ని ప్రాంతాల్లోనూ వైద్యులను పంపి.. వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించింది.
అన్నింటికన్నా ముఖ్యంగా తిరుపతిలో ల్యాబ్ను మొట్టమొదట ఏర్పాటు చేసింది. ఇప్పుడు కాకినాడ లో నూ అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేటు ఆసుపత్రులను కూడా అలెర్ట్ చేసింది. అయినా కూడా ఓ వర్గం మీడియా మాత్రం కరోనా విషయంలో ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందంటూ.. తన వ్యాఖ్యానాన్ని అచ్చే సింది. ఇక, రెండో కీలక పరిణామం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాసినట్టుగా చెబుతున్న లేఖ విషయంలో భారీ ఎత్తున ప్రచారం కల్పించారు. మొదటి పేజీల్లోనే ప్రచురించేశారు. అయితే, వాస్తవానికి ఆ లేఖ ఆయన రాశారో.. రాయలేదో కూడా నిర్ధారణ కాలేదు.
కానీ, ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారంటూ.. భారీ ఎత్తున వండి వార్చారు. ఇదంతా ఎవరి మెప్పుకోసం చేస్తున్నారో తెలియని విషయం కాదు. ఎవరిని డీమోరలైజ్ చేసేందుకు చేస్తున్నారో కూడా ప్రజలకు తెలుసు! ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితిలో ప్రజలు లేరనే విషయాన్ని ఈ వర్గం మీడియా తెలుసుకోవాలని మేధావులు సూచిస్తున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. గత ఏడాది ఎన్నికల సమయంలో ఈ మీడియా, ఈ పత్రికలు.. ఇలానే చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసినా.. జగన్ను పాతాళానికి తొక్కేసినా.. ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో అప్పుడే మరిచిపోవడం..!!