రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం అంటారు పరిశీలకులు. ఇప్పుడు వైసీపీలో నూ ఇలాంటి పరిణామాలే ఎదురవుతున్నాయి. ఎస్సీ నియోజకవర్గం అయిన కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీలో షాకింగ్ పాలిటిక్స్ చోటు చేసుకున్నాయి. ఇక్కడ నుంచి గత ఏడాది విజయం సాధించిన ఎమ్మెల్యే ఆర్ధర్కు వైసీపీ ఇంచార్జ్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయిలో ఉంది. అయితే, మేనేజ్మెంట్ విషయంలో సిద్ధార్థదే పైచేయిగా ఉండడం, వైసీపీ అధినేత జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన యువ నేత కావడంతో పరిస్థితులు అన్నీ కూడా ఆయనకే అనుకూలంగా ఉన్నాయి.
దీంతో ఎమ్మెల్యే అయినప్పటికీ.. ఆర్ధర్ నెంబర్ 2గానే ఉండిపోయారు. ఆయన నియోజకవర్గంలో కేవలం టె క్నికల్గా మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఏ నిర్ణయమైనా. కూడా సిద్ధార్థ చేతుల మీదుగానే జరుగు తోంది. దీంతో ఆర్ధర్కు సిద్ధార్థకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇలా ఉన్న పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు ఆర్ధర్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా.. నియోజకవర్గంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఐజయ్యను వైసీపీ లో చేర్చుకున్నారు., దీంతో ఇప్పటి వరకు ఆర్ధర్కు తలనొప్పిగా పరిణమించినా.. తన సీటుకు ఎసరు వస్తుందని ఆయన భావించలేదు.
కానీ, ఇప్పుడు ఐజయ్య ఎంట్రీతో ఏకంగా ఇక తన సీటుకు కూడా చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా బైరెడ్డే ఐజయ్యను వైసీపీలోకి తెచ్చారని ప్రచారం జరుగుతోంది. దీంతో నిన్న మొన్నటి వరకు సిద్ధార్థపై ఖస్సుమంటూ బుసలు కొట్టిన ఆర్ధర్.. ఇప్పుడు సర్దుకు పోతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనను కాదని ఐజయ్యకు ఇచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలని అనుకున్నారు. అయితే, బైరెడ్డి దూకుడు మాత్రం తగ్గించకపోగా.. స్థానిక ఎన్నికల్లో ఇంకా పెంచేశారు. దీంతో ఆర్ధర్ పరిస్థితి వానపాము మాదిరిగా తయారైందని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.