సాక్షత్తు రాములవారు కొలువున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొందరు వ్యక్తులు చేసిన క్షుద్రపూజలు కలకలం రేపాయి. టేకులపల్లి మండల పరిధిలో గురువారం వెలుగుచూసింది. క్షద్రపూజలు చేస్తే ఆరోగ్యం కుదుటపడుతుంది అని నమ్మి ఒక వ్యక్తి మోసగాళ్ల వలలో చిక్కుకున్నాడు. భారీగా నగదు పోగొట్టుకున్నాడు.
అసలు విషయం ఏంటంటే మానసిక బాధతో బాధపడే షేక్ బకర్సిద్ధిక్ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన వ్యక్తి. కొన్ని రోజుల నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఆరోగ్యం కూడా సరిగా లేదు. అయితే షేక్ కి టేకులపల్లి మండలానికి చెందిన కోరం రవీందర్ అలియాస్ సురేశ్తో పరిచయం ఏర్పడింది. షేక్ బకర్సిద్ధిక్ మానసిక ఇబ్బందులను పసిగట్టిన రవీందర్ అతని దగ్గర డబ్బులు గుంజాలని భావించాడు. అందులో భాగంగానే ఒక ఘోరమయిన ప్లాన్ వేసాడు.
అ ప్లాన్ లో భాగంగా క్షుద్రపూజలు చేసి ఇబ్బందులు తొలగిస్తాననీ షేక్ ని నమ్మబలికాడు. ఇందుకుగానూ ఖర్చు అవుతుందని తెలపడంతో, బకర్సిద్ధిక్ కూడా డబ్బు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. మొత్తం రూ.1.75లక్షలకు ఒప్పందం చేసుకుని అడ్వాన్స్గా రూ.49,999 ఫోన్పే ద్వారా పంపించాడు. బుధవారం రాత్రి తడికలపూడి మార్గంలో బాధితుడిని ఓ నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి క్షుద్రపూజలు ప్రారంభిచేందుకు సిద్ధమయ్యారు. అయితే పూజ ప్రారంభానికి ముందు మిగిలిన రూ.1.25లక్షలను కూడా ఇవ్వాలని కోరడంతో చేసేది లేక బకర్సిద్ధిక్ ఆ మొత్తాన్ని కూడా రవీందర్కు నగదు రూపంలో ఇచ్చాడు. ముందుగానే రవీందర్ ప్లాన్ తో అక్కడకి వచ్చాడు. పూజ ప్రారంభిస్తున్న సమయంలో రవీందర్ ప్లాన్ ప్రకారం కొందరు వ్యక్తులు పొదల మాటు నుంచి వచ్చి వారిపై దాడి చేశారు.
దీంతో రవీందర్, బకర్సిద్ధిక్ చెరో దిక్కుకు పారిపోయారు. పూజా ఆగిపోయింది. బాధితుడు భయంతో టేకులపల్లి చేరుకుని తనకు జరిగిన ఘటనను స్థానికులకు చెప్పి ఆవేదన చెందాడు. స్థానికులు వెళ్లి చూస్తే పూజా సామాగ్రి తప్ప, వ్యక్తులు కనిపించలేదు. ఫోన్పే ద్వారా రూ.49,999, నగదు రూపంలో రూ.1.25లక్షలు ముట్టజెప్పినట్లు వివరించారు. దీంతో స్థానికులు టేకులపల్లి ఎస్సై ఇమ్మడి రాజ్కుమార్కు సమాచారం ఇచ్చారు. దీనిపై ఇంకా ఫిర్యాదు అందలేదని, రహస్యంగా విచారిస్తామన్నారు. మూఢ నమ్మకాలని నమ్మి చాలా మంది మోసపోతున్నారు. ఎప్పటికన్నా జాగ్రత్తలు తీసుకోవాలి.