వాళ్లిద్దరూ అన్నదమ్ములు.. పేరుబోయిన హస్తం నేతలు..! కాంగ్రెస్లో అందరూ దద్దమ్మలే.. ఇక తామిద్దరమే దమ్మున్న నేతలమని ఫీలవుతూ ఉంటారు. నల్లగొండలో తాము లేకుంటే పార్టీయే లేదంటూ వీరవిధేయత ప్రదర్శిస్తూ ఉంటారు. పెద్దలను గౌరవించడంలో, చిన్నలతో మర్యాదగా ఉండడంలో అన్న కాస్త నయమేగానీ.. ఇక తమ్ముడికైతే ఎంత పెద్దనాయకుడైనా లెక్కేలేదు. నోటికొచ్చింది మాట్లాడుతారు. పార్టీ పరువు తీయడంలో ఆయన ముందువరుసలో ఉంటారు. అధిష్ఠానాన్ని ధిక్కరించడంలో, మొట్టికాయలు కొట్టించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఇదే సమయంలో పక్క చూపులు చూడడంలో కూడా మంచి దిట్ట. ఆ మధ్య కమలదళంలో చేరేందుకు తమ్ముడు తెగ ప్రయత్నాలు చేశారు. అనుచరులతో తెగ ముచ్చట్లు పెట్టారు. ఇక పోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే.. ఆయనగారి తీరును చూసి విసుగుచెందిన పలువురు అనుచరులు చుక్కలు చూపించారట. పోతే మీరు పోండి.. మీమైతే రాం.. అంటూ తెగేసి చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారట. ఇక అప్పటి నుంచి పక్కచూపులు చూడడం మానుకొని గమ్మునుంటున్నారు.
ఇక అన్నకూడా ఏం తక్కువ తినలేదు. దిక్కులు పిక్కటిల్లేలా ముచ్చట్లు చెబుతారు. నల్లగొండలో తనకు తిరుగేలేదని విర్రవీగితే.. ముందుస్తు ఎన్నికల్లో ప్రజలు మూటముల్లె సర్దిపంపారు. ఆ తర్వాత భువనగిరి ప్రజలు కరుణించి పార్లమెంట్కు పంపి పరువు కాపాడారు. నిజానికి.. ఒకప్పుడు అన్నదమ్ములిద్దరి మాటకు ఎంతో విలువ ఉండేది. ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో మంచి పలుకుబడి ఉండేది. కానీ.. వీరు తీరుతోనే చేజేతులా మాట విలవను పోగొట్టుకుంటారు. ఆ.. వారిద్దరూ ఎప్పుడూ అలాగే మాట్లాడుతారులే.. అన్న భావన ప్రజల్లో, అనుచరుల్లో, పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. అందుకు ప్రస్తుతం వారిని లైట్ తీసుకుంటున్నారు. మరోవైపు, టీపీసీసీ చీఫ్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని అన్న తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్ననే పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కూడా కలిశారు. ఇక తనకే పదవి వస్తుందన్న నమ్మకంతో ఉంటున్నారు. కానీ.. ఎక్కడో తేగా కొడుతోంది. అమ్మో.. ఆయనకు ఆ పదవి ఇస్తే.. కాంగ్రెస్ పార్టీ అయింత ఉనికి కోల్పోవడం ఖాయమని పలువురు నేతలు ఎసరుపెట్టే ప్రయత్నంలో ఉన్నారట.