పిల్లలు పెద్దలకు చెప్పకుండా కొన్ని పనులు చేస్తుంటారు. అవి సరదా సరదాగా చేసే విన్యాసాలు అనుకుంటారు కాని ఒక్కోసారి ప్రాణాపాయం కూడా తప్పదు. అందుకే ఏ పని చేసినా ఆలోచించి అడుగు వెయ్యాలి. తొందర పడి ఎక్కడికి పడితే అక్కడకి వెళ్ళకూడదు. అందులోనూ చెరువులు సముద్రాలు వంటి నీటిసాంధ్రత ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ జాగ్రత్త మరింత ఎక్కువగా ఉండాలి. లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎంతైనా ఉంది. చివరికి తల్లిదండ్రులకు కడుపుకోత తప్పించి మిగిలేదేమీ లేదు.
ఇలాంటి విషాద గాధే ఒకటి కృష్ణా జిల్లలో చోటు చేసుకుంది. ఈత కోసమని సరదాగా కుర్రాళ్ళందరూ కలిసి కృష్ణానదికి వెళ్ళారు. వీరంతా కూడా కాలేజీ చదివే విద్యార్ధులే. ఇక వీరులపాడు మండలంలోని సంగమేశ్వర దేవాలయం సమీపంలో వైరా కట్టలేరులో దగ్గర ఉన్న నీళ్ళల్లో ఈతకొడదామని సరదాగా ఓ ముగ్గురు విద్యార్థులు నీటిలో దిగారు. ఆ తర్వాత సడెన్గా గల్లంతయ్యారు. అయితే ఈ ముగ్గురు విద్యార్ధులు కూడా విజయవాడ లయోలా కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న గోపిరెడ్డి, కంచికచర్ల దీక్ష కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న శ్రీనివాసరెడ్డి, దీక్ష కాలేజీ ఇంటర్ సెకండియర్ విద్యార్థి రవీందర్ రెడ్డిగా గుర్తించారు. ఇక సరదాగా ఈత కొట్టేందుకు వైరా కట్టలేరు వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది.
అయితే అనుకోకుండా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ ఏటిలో మునిగిపోయి గల్లంతైపోయారు. ఇక ఈ విద్యార్థులు మునిగిపోవడాన్ని గమనించిన అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ఆలస్యం చెయ్యకుండా గాలింపు చర్యలను చేపట్టారు. అయితే వారిలో ఒకరి మృతదేహం మాత్రం లభ్యమైనట్లు తెలుస్తోంది. మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. గల్లంతైన విద్యార్థులందరూ వీరులపాడు మండలం నరసింహారావు పాలేనికి చెందిన వారిగా గుర్తించారు. దీంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం విన్న తల్లిదండ్రుల గుండెలు బాధతో బరువెక్కిపోయాయి. ఈ ఘటనకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.