కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలందరూ ఎవరికివారుగా స్వీయనియంత్రణ పాటించాలని, సామాజిక బాధ్యతగా ముందుకు వెళ్లాలని ఓ వైపు ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా.. పలువురు సెలబ్రిటీలు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్ ప్రపంచంపై కోరలు చాస్తున్న వేళ బాధ్యతాయుతమైన గాయనీ నిర్లక్ష్యం పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. బాలీవుడ్ గాయని కనికా కపూర్ నిర్లక్ష్యంతో నేడు ఎందరో ప్రముఖులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. చివరికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు కూడా శనివారం కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె నిర్లక్ష్యంపై లక్నో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కనికా కపూర్ విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత స్వీయనియంత్రణ పాటించకుండా పలు పార్టీలకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆమెలో కరోనా అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. అయితే.. ఆమె పాల్గొన్న ఈ పార్టీలకు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరు కావడంతో సెద్ద సమస్య ఏర్పడింది.
అయితే తనకు కరోనా సోకినట్లు కనికాకపూర్ శుక్రవారం ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. ఎవరైతే ఆమె పాల్గొన్న పార్టీలకు హాజరయ్యారో వారంతా తీవ్ర ఆందోళనకు గురై స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కనికా హాజరైన పార్టీకి ఎంపీ దుష్యంత్ కూడా వెళ్లారు. ఆ తర్వాత రాజస్థాన్, యూపీ ఎంపీలకు మార్చి 18న రాష్ట్రపతి విందుకు దుష్యంత్ హాజరయ్యారు. దీంతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. శనివారం రాష్ట్రపతికి కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, కనికాకపూర్ విషయం తెలియగానే రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్, యూపీ ఆరోగ్య శాఖ మంత్రి జైప్రతాప్ సింగ్ తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.
అంతేగాకుండా, దుష్యంత్ను కలిసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్.. క్వారంటైన్లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. ఎంపీ దుష్యంత్ ఇటీవల పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వరుణ్గాంధీతో ఆయన సన్నిహితంగా మెలిగారు. ఈ నెల 18న జరిగిన పార్లమెంట్ స్థాయి సంఘం సమావేశంలో ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ రెండు గంటలపాటు దుష్యంత్ పక్కనే కూర్చున్నారు. గురువారం దుష్యంత్ హాజరైన ఓ దావత్లో అనుప్రియా పటేల్ పాల్గొన్నారు. ఇలా.. ప్రముఖలందరూ ఈ జాబితాలో ఉండడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.